అమరావతి (చైతన్య రథం): ‘‘సీడ్ రాఖీ’’ ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అడబిడ్డలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘మీ సోదరుల జన్మ నక్షత్రానికి తగిన చెట్టు విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ రాఖీ’ని కట్టమని ఆడబిడ్డలను కోరుతున్నాను. మీరు కట్టే సీడ్ రాఖీ తరువాత కాలంలో నేలతల్లిని చేరి మొక్కగా మారుతుంది. ఇది మీ అన్నదమ్ములకు శుభం చేకూర్చడమే కాదు… పర్యావరణానికి హితంగా కూడా ఉంటుంది. ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతమైన అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొని కోటి మొక్కల వన మహోత్సవాన్ని ప్రారంభించాను. వచ్చే పర్యావరణ దినోత్సవానికి రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలని సంకల్పించాం. దీనికి ‘సీడ్ రాఖీ’ కార్యక్రమంతో మద్దతివ్వాలని మహిళలకు విన్నవిస్తున్నాను’ అని సీఎం చందబాబు పిలుపునిచ్చారు.