- కంట్రోల్ రూమ్కు వచ్చే ప్రతి కాల్కు వెంటనే స్పందించాలి
- ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్చలు తీసుకోవాలి
- ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
అమరావతి (చైతన్యరథం): దిత్వా తుపాను ముంచుకొస్తున్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశించారు. దిత్వా తుపాను తీవ్రత నేపధ్యంలో హోంమంత్రి అనిత ఆదివారం సచివాలయంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రెండు రోజుల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడటం మన అందరి బాధ్యత అని హోంమంత్రి స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్కు వచ్చే ప్రతి కాలు వెంటనే స్పందించాలని ఆమె సూచించారు.
ప్రమాద ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో అధికారులని నియమించాలని ఆదేశించారు. రోడ్లపై పడిన చెట్టు కొమ్మలు, హోర్డింగ్స్ వంటి అడ్డంకులను వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. కాగా ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్టు హెూంమంత్రికి జిల్లా కలెక్టర్లు నివేదించారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు.













