- జగన్రెడ్డికి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
- నా సొంత డబ్బుతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
- కుట్టు మిషన్లు, టైలరింగ్ మెటీరియల్ కూడా నా డబ్బుతోనే పంపిణీ
- నా సొంత సొమ్ము కాబట్టే శుభానికి సంకేతమైన పసుపు రంగు మిషన్లు ఇచ్చాం
- నీలా ప్రభుత్వ ధనంతో పార్టీ రంగులు, సొంత పేర్లు పెట్టుకునే నీచ బుద్ధి మాకు లేదు
- నీ అబద్దం తాత్కాలికం, మా నిజం శాశ్వతం
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ సొమ్ముతో కుట్టుమిషన్లను కొని పసుపు రంగు వేసి అందిస్తున్నారంటూ వైఎస్ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ గట్టిగా తిప్పికొట్టారు. ఫేక్ పార్టీ వైసీపీకి ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజలని గాలికి వదిలేసి, జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరువ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల, మత అంతరాలు పాటించకుండా… తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులు వేలాది మందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేశానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022, జూన్20న ప్రారంభించాం. ఈ కేంద్రంలో ఇప్పటి వరకూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్షణ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు అందజేశాం. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023, ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఇక్కడ 17 బ్యాచుల్లో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశక్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరందరికీ మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటి వరకూ 3508 మందికి శిక్షణ పూర్తిచేసి, ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశాం. ఇవన్నీ నా జేబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే…శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు వేసుకోవటం, నీ పేర్లు పెట్టుకోవటం లాంటి కక్కుర్తి పనులు మేం చేయం. ఆ యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వతం. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోవాలని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.