- గృహ నిర్మాణ లబ్దిదారులను వైసీపీ ముంచేసింది..
- రూ.2,378 కోట్ల గృహ నిర్మాణ నిధులను మురగబెట్టారు
- రూ.3,598 కోట్ల నిధులను దారిమళ్లించారు…
- 1,39,243 లబ్దిదారులనూ జాబితానుంచి తొలగించారు…
- గత ప్రభుత్వ తప్పిదాలను కూటమి సరిదిద్దుతోంది
- అర్హులందరికీ గృహాల మంజూరీకై చర్యలు చేపట్టాం
- గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. నిరుపేదలందరికీ శాశ్వత గృహవసతి కల్పించడంలో పూర్తిస్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం.. కూటమిపై బురదజల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహనిర్మాణాలపై కేంద్రం రూ.20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో తమ ప్రభుత్వహయాంలో 2018లో ఆవాస్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి పీఎంఏవై గ్రామీణ్ `1.0 క్రింద 3,18,987 మంది లబ్దిదారులను గుర్తించి కేంద్ర వెబ్సైట్లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ నుండి 1,39,243మంది లబ్దిదారులను తొలగించి వారికి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర పోర్టల్లో మిగిలిన 1,79,744మంది లబ్దిదారుల్లో 1,79,060మంది లబ్దిదారులకు 2021-22లో కేంద్రం ఇళ్లను కేటాయించిందన్నారు. ఇంకా ఆ కేంద్ర పోర్టల్లో మిగిలివున్న 684మంది లబ్దిదారుల్లో 505 మందికి ఈ ఏడాదిలో కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు.
అదేవిధంగా 2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథం క్రింద ప్రతి గృహానికి రూ.2.50 లక్షలమేర రాష్ట్ర నిధులను మంజూరు చేయడమే కాకుండా అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు మరియు పివిటిజిలకు రూ.లక్ష అందజేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ప్రతి గృహానికి కేంద్రం ఇచ్చిన రూ.1.5 లక్షలకు అదనంగా కేవలం రూ.30 వేలు మాత్రమే ఇచ్చిందన్నారు.
అర్హులందరికీ శాశ్వత గృహ వసతి
వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృఢనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని పార్థసారథి వివరించారు. పీఎంఏవై`1.0 పథకం వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తికావాల్సి ఉందని, అయితే సీఎం చంద్రబాబు చొరవతో పథకాన్ని 2025 డిశంబరు వరకూ పొడిగించారన్నారు. ఈ పథకం క్రింద తమ ప్రభుత్వం 1.15 లక్షల గృహ నిర్మాణాలను పూర్తిచేయడం జరిగిందని, మిగిలిన 7.35 లక్షల గృహాల్లో 1.5 లక్షల గృహాలను జూన్ మాసాంతానికల్లా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు.
అదే విధంగా పీఎంఏవై` 2.0 పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చిత్తశుద్దితో ఉన్నామన్నారు. ఈ పథకం క్రింద లబ్దిదారులను గుర్తించే సర్వే ఇప్పటికే మొదలైందని, ఇప్పటి వరకూ 11,600 లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద కేంద్రం నుండి దాదాపు ఐదు లక్షల గృహాలను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నదన్నారు. ఇప్పటికే ఈ పథకం క్రింద 50 వేల గృహాలను మంజూరు చేయడం జరిగిందని, మార్చి మాసాంతానికి మరో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో లబ్దిదారులు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి పార్థసారథి వివరించారు.