- మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
- మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడికి మంత్రి లోకేష్ అభినందనలు
- మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కీర్తిచక్ర అవార్డు గ్రహీత రాంగోపాల్ నాయుడు
ఉండవల్లి (చైతన్యరథం): దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రాంగోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్గా పనిచేస్తుండగా.. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద దేశం కోసం ప్రాణాలకు తెగించి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు తోటి సైనికులను రక్షించారు. దీంతో మేజర్ రాంగోపాల్ నాయుడును ఈ ఏడాది మే 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారమైన కీర్తి చక్రతో సత్కరించారు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రాంగోపాల్ నాయుడు నిలిచారు. దేశం కోసం అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి కీర్తి చక్ర అవార్డు పొందిన రాంగోపాల్ నాయుడును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. దేశంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణంగా ఉందని ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.