- కొరత ఉన్న ప్రాంతాలకు త్వరితగతిన సరఫరా చేయాలి
- వ్యవసాయ, మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ (చైతన్యరథం): ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళికబద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని సామున్, సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీప్ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు (యూరియా `6.22 లక్షల మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి- 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎం.ఓ పి- 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు ` 6.30 లక్షల మెట్రిక్ టన్నులు) అవసరం ఉందని మంత్రికి కమిషనర్ ఢల్లీిరావు వివరించారు. కేంద్రం నుండి ఆగస్ట్ నెలకు సంబంధించి రావాల్సిన ఎరువులు సరైన సమయంలో అందలేదని, దాంతో కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
రాష్ట్రానికి ఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభ నిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందచేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో వెంటనే గుర్తించి ఆయా ప్రాంతాలకు మార్క్ఫెడ్ గోదాములలో నిల్వ ఉన్న ఎరువులను త్వరితగతిన ఆయా జిల్లాలలోని సహకార సంస్థలకు పంపాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరలకు యూరియాను, డీఏపీని అమ్ముకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి రావల్సిన పెండిరగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించి, వేగంగా ఎరువులను అందచేయాలని కోరారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులు ఆర్ఎఫ్సీ రామగుండం నుండి 19,000 మెట్రిక్ టన్నులు, కాకినాడ పోర్ట్కు రావాల్సిన ఎరువులు కనీసం 30,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్ట్కు రావాల్సిన 18,500 మెట్రిక్ టన్నుల ఎరువులను సత్వరం వచ్చేలా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వేగవంతంగా జిల్లాలకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని, 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. కావాలని యూరియా కొరత సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించమని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపదాస్, మార్క్ఫెడ్ జీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.