- పాలనాదక్షణ చంద్రబాబు ప్రత్యేకత
- కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి (చైతన్య రథం): భవిష్యత్తును ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు ఏపీ సీఎం చంద్రబాబు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాలనాదక్షతతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించాయని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర చిరస్మరణీయమన్నారు. పాలనలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా వాటిని సవాళ్లుగా స్వీకరించి ముందడుగు వేశారన్నారు. ‘‘హైదరాబాద్ను ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ చేసిన ఘనత చంద్రబాబుదే. ఆయన ఐటీకి పెద్దపీట వేయడంతోనే తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాలనుంచి ఐటీ ఉద్యోగులు వచ్చారు. రైతుబజార్ల ఏర్పాటు, డ్వాక్రా సంఘాల స్థాపన, పేదలకు వెలుగు ప్రాజెక్ట్, మీసేవా కేంద్రాలు ఏర్పాటువంటి నూతన ఆవిష్కరణలు ఆయన ముందుచూపును తెలియచేస్తాయి.
రాష్ట్ర విభజన అనంతరం క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. రాజధానిలేని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా సాగారు. 2024లోనూ మరింత క్లిష్ట పరిస్థితుల్లో పాలన పగ్గాలు తీసుకున్నారు. కఠిన సవాళ్లు ముందున్నా దృఢచిత్తంతో పాలన వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రానికి సీఎంగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు నిధులు సాధించడం చంద్రబాబు నాయకత్వ లక్షణాలు తెలియచేస్తాయి. పాలన వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందేలా చేస్తున్నారు. దార్శనికత కలిగిన చంద్రబాబు నిర్దేశకత్వంలో మేం ఏపీ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.