- ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెంచేందుకు విదేశాల్లో పీ-4 సలహాదారుల నియామకం
- ఎంపికైన బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే
- మంచి ఫలితాలు చూపిన మార్గదర్శులకు గుర్తింపు, గౌరవం
- పీ-4పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం
అమరావతి (చైతన్య రథం): జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పీ`4 విధానం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సీఎం లోతైన సమీక్ష జరిపారు. పీ`4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా.. వారిలో ఇప్పటివరకు 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. సమాజంలో చాలామంది ఏదోక రూపంలో పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారికి పీ`4ను వేదికగా మార్చాలని సీఎం అన్నారు. మార్గదర్శకులుగా ఉండేవారిని సంప్రదించేందుకు… బంగారు కుటుంబాలను వారితో అనుసంధానించేందుకు మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం మానిటరింగ్ చేసేందుకు కాల్సెంటర్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. మార్గదర్శకులుగా ఉండాలనుకునే వారికి అసవరమైన సమాచారాన్ని, గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మార్గదర్శలతో బంగారు కుటుంబాలను అనుసంధానించిన తరవాత…. అంతకుముందు వారి పరిస్థితి, బంగారు కుటుంబంగా ఎంపికైన తరువాత వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్వేలను కూడా నిర్వహించాలని సీఎం సూచించారు. కార్యక్రమం అమలుపై విధిగా ఆడిటింగ్ నిర్వహించడం, మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం, పీ`4 ప్రభావాన్ని నివేదకల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శకులకు కూడా అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
పారిశ్రామికవేత్తలు, ఎన్ఐఆర్లు, సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలవారితో ప్రత్యేక కార్యక్రమాలు పీ`4 కాన్సెప్ట్ను వివరించి… వారిని మార్గదర్శులుగా ఉండేందుకు ఆహ్వానించాలని సూచించారు. కార్యక్రమంలో మార్గదర్శుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్ 100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సివోవోలు, సీఎఫ్ఓ, ఎండీలు, చైర్మన్లతో నేరుగా తానే మాట్లాడి పిలుపునిస్తానని సీఎం అన్నారు. దీంతోపాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శులుగా ముందుకొచ్చేందుకు వారిని ఆహ్వానిస్తానని అన్నారు. ఎన్ఆర్ఐలను పీ`4 అడ్వైజర్లుగా పెట్టి…. ఎన్ఆర్ఐలను మార్గదర్శకులుగా చేర్చేందుకు ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. జీరో పావర్టీ, పీ`4 కాన్సెప్ట్ను ప్రమోట్ చేసేందుకు రూపొందించిన పలు లోగోలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. త్వరలో ఒక లోగోను ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా పీ`4ను ప్రారంభించిన మార్చి 30ని పి`4 వార్షికోత్సవంగా నిర్వహించి సాధించిన విజయాలను చాటి చెప్పాలన్నారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు.