- డయాఫ్రం వాల్ మందంపై సాక్షిలో అసత్య కథనాలు
- 1.5 మీటర్ల మందంతోనే నిర్మాణం
- 0.9 మీటర్లకు కుదించారంటూ అవినీతి పత్రిక దుష్ప్రచారం
- షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్ట్ పనులు
- 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టీకరణ
- ప్రాజెక్ట్ నిర్మాణపనులు క్షేత్రస్థాయిలో పరిశీలన
- కంపెనీ ప్రతినిధులతో డీ వాల్ మందాన్ని కొలిపించి పాత్రికేయులకు చూపించిన మంత్రి
పోలవరం (చైతన్యరథం): పోలవరం ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అవినీతి పత్రిక సాక్షి మాత్రం అబద్ధాలు పోగేసి ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అసత్య కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించేస్తున్నారని సాక్షి పత్రిక చేస్తున్న విష ప్రచారాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండిరచారు. కనీస అవగాహన లేకుండా, ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నోటికొచ్చిన అబద్ధాలు అచ్చేసి పోలవరం ప్రాజెక్టు పనుల వేగంపై నీళ్లు చల్లాలనుకోవటం వైకాపా అవివేకం, అజ్ఞానం అని మంత్రి దుయ్యబట్టారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు పాత్రికేయుల సమక్షంలో డయాఫ్రమ్ వాల్ ప్యానల్ మందం.. బావర్ కంపెనీ ప్రతినిధులతో కొలిపించి 1.5 మీటర్లు ఉండడాన్ని చూపించారు. దీనిని 0.9 మీటర్లకు కుదించారంటూ సాక్షి పత్రిక చేస్తున్న ప్రచారం తప్పని నిరూపించారు. గతంలో కూడా పోలవరం డ్యాం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ విష ప్రచారం చేసి, వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ముఖం చాటేసారని మంత్రి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం అభివృద్ధి నిరోధక వైకాపాకు ఇష్టం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక అభివృద్ధి పనులకు అనుక్షణం అడ్డు తగలడానికి వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలో ప్రజలు చీదరించుకుంటున్నా ఆ పార్టీకి బుద్ధి రావటం లేదన్నారు.
2027 నాటికి పూర్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సీడబ్ల్యుసీ, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు సమన్వయంతో కలిసికట్టుగా తీసుకున్న సమయాధారిత నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి రామానాయుడు తెలిపారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారని మంత్రి చెప్పారు. సెక్రటేరియట్లో ప్రతి 15 రోజులకు ఓ సారి పోలవరం పనులపై చంద్రబాబు స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ సంవత్సరానికి పూర్తి కావాలన్న లక్ష్యం మేరకే పనులు జరుగుతున్నాయని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావచ్చాయని చెప్పారు. 2027 చివరినాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం.. పూర్తిచేసి తీరతామని నిమ్మల ధీమా వ్యక్తం చేశారు.. ఇందులో భాగంగా ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయని ఆయన వివరించారు. ప్రాజెక్ట్ పనుల్లో ప్రపంచంలోనే పేరెన్నికగన్న జర్మనీకి చెందిన బావర్ కంపెనీ తో ‘‘మేఘా’’ పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం కాలేదు, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం.. అని చేతులెత్తేసిన, చేతకాని అప్పటి మంత్రులు నేడు పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టును చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు సమర్థ నాయకత్వంలో 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని మంత్రి రామానాయుడు మరోసారి స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బోరగం శ్రీనివాస్, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, మేఘా ఇంజనీరింగ్ డైరెక్టర్ సుబ్బయ్య, ఇతర ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.