- రాష్ట్ర పునర్నిర్మాణానికే పనిచేస్తున్నామని ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజుగా జూన్ 4ను అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ప్రజా విప్లవానికి నియంతలు, ఉన్మాద పాలకులు కొట్టుకుపోయిన రోజుగా ప్రస్తావించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికపై పోస్టు పెడుతూ.. ‘అధికారం అహంతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో ఆంధ్ర రాష్ట్రం గెలిచిన రోజు.
ఏడాది క్రితం ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు పాలనను గాడిన పెట్టాం. సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసువంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులకు అభినందనలు.. ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్!’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆ పోస్టులో పేర్కొన్నారు.