- గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటన అంటే మొక్కలు నరికారు
- మాది మొక్కలు నాటే ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంది
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి (చైతన్యరథం): మొక్కలను నాటి, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు ఇచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా నియోజకవర్గంలోని జే పంగలూరు మండలంలోని చందలూరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపు నిచ్చారు. మొక్కలపై అందరూ మక్కువ పెంచుకోవాలని హితవు పలికారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ పర్యటనల్లో వందల మొక్కలను నరికేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య, వన పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక పండుగలా చేపట్టాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. అనంతరం పంగులూరు మండలంలోని జనకవరం గ్రామంలో ఇటీవల చనిపోయిన రైతు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. రైతు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలను మంత్రి గొట్టిపాటి పరామర్శించారు.
కార్యకర్తల కుటుంబానికి ఆర్థిక సాయం
కొరిశపాడు మండలం, తమ్మవరం గ్రామంలో వెంకట్రావు అనే పార్టీ కార్యకర్త ఇటీవలే ప్రమాదంలో మరణించగా బాధిత కుటుంబ సభ్యులను మంత్రి గొట్టిపాటి పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, తద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్కి ప్రతి ఒక్కరూ అర్హులవుతారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అద్దంకి నియోజకవర్గ పరిధిలో… ఈ మధ్య కాలంలో వివిధ కారణాలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గొట్టిపాటి… వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు పార్టీ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.