- రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నూతన సంవత్సర కానుక
- గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫొటోలతో భూమి హక్కు పత్రాలు
- ఎన్నికల హామీ మేరకు తాజాగా రాజముద్రతో పంపిణీకి శ్రీకారం
- రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
- తొలిరోజు రాష్ర్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా అందజేత
- ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం
- తాను కూడా ఒకరోజు పాల్గొంటానన్న సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాజముద్రతో అన్నదాతలకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై శు క్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. వివాదాలు లేని స్థలాలను కూడా రీ సర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యం. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల్లో అభద్రతను తొలగించాం. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలకు నాటి పాలకులు రూ.22 కోట్లు తగలేశారు. నేడు పాసుపుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోంది. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలి. నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలి. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించాం.
జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశాం. వేలాది గ్రామాల్లో సంబరంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ మొదలైంది. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న వాటిని పంపిణీ చేస్తోండటంతో ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో తాను కూడా ఒకరోజు పాల్గొంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.














