- లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ
మర్రిపూడి (చైతన్యరథం): తమ ప్రభుత్వం పేదల సేవకు అంకితమై పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిలంకూరులో శనివారం ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి మంత్రి స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. జూన్ లో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తాం. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ఈ పథకం అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తాం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డోలా స్పష్టం చేశారు.
`