తాడికొండ (చైతన్యరథం): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్.రాజశేఖర్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ గురుకుల పాఠశాల అయిన గుంటూరు జిల్లా తాడికొండలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఎస్.రాజశేఖర్ మాట్లాడుతూ…అనేక రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రపంచానికి అందించిన ఈ పాఠశాలను సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో విద్యా రంగంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పాఠశాల ఆవరణ మొత్తం పర్యటించాను.. అలాగే సిబ్బందితో చర్చించి పాఠశాల స్థితిగతులను తెలుసుకున్నానని తెలిపారు. తాను కూడా శ్రీశైలంలోని గురుకుల పాఠశాల విద్యార్థి కావడంతో… పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటిస్తూ వారితో మమేకం కావడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు వెంకట రమణ, డాక్టర్ మారుతి రాం గోపాల్ తో కలిసి మిగతా సభ్యుల సహకారంతో జరుగుతున్న పనులను ఛైర్మన్ సందర్శించారు. కన్నతల్లి వంటి గురుకుల పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషిని ఛైర్మన్ రాజశేఖర్ అభినందించారు. లైబ్రరీ బిల్డింగ్, కంప్యూటర్ ల్యాబ్ పూర్వ విద్యార్ధుల సహాయంతో ఆధునీకరించారన్నారు. ఈ సందర్భంగా పిల్లల వసతి గృహం, సిమెంట్ రోడ్డు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఆయనకు సిబ్బంది వినతులు ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ పాఠశాల అభివృద్ధికి సంబంధించి డిపార్ట్మెంట్ ఇంజినీర్లను అంచనాలు తయారు చేయమని కోరినట్లు ఛైర్మన్ తెలిపారు.