- రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- ఖరీఫ్ సీజన్లో ప్రత్యామ్నాయ పంటలు మేలు
- వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ
- పర్చూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి
పర్చూరు (చైతన్యరథం): నల్లబర్లీ పొగాకు చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పొగాకు రైతులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా నియోజకవర్గ కేంద్రం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రారంభించారు. ముందుగా పర్చూరు ప్రధాన కూడలి నుంచి మార్కెట్ యార్డ్ వరకు రైతులు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. మంత్రికి రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం గోదామును మంత్రి పరిశీలించారు. హెచ్డిఆర్, హెచ్డిఎం రకం బ్లాక్ బర్లీ పొగాకు క్వింటా రూ. 12వేలు, హెచ్డిఎక్స్ రకం పొగాకు ఒక క్వింటా రూ.ఆరు వేలు ధరతో మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రకటించారు.
మెదటిసారిగా ప్రభుత్వం కొనుగోలు
నల్లబర్లీ పొగాకును రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కొనుగోలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు రాజుగా ఉండాలి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిరచేలా అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. రైతుల కష్టాలన్నీ తీరుస్తున్నాం, రహదారులు, నీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారని వివరించారు. 90% రాయితీపై స్ప్రింక్లర్లు, బిందు సేద్యానికి సంబంధించిన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వ ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1,650 కోట్లను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించామన్నారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండిరచిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్చి, మామిడి, కోకో, బ్లాక్ బర్లీ పొగాకు పంటలకు తీవ్ర సమస్య వచ్చిందన్నారు. మిర్చి ధర తగ్గకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికా బద్ధంగా మద్దతు ధరతో కొనుగోలు చేశారన్నారు. మామిడి పంటకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన కంపెనీలు ఇప్పుడు దిగుబడి రాగానే చేతులెత్తేశాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించిందన్నారు. కొనుగోలు చేసిన పొగాకును విదేశాలకు ఎగుమతి చేయాలంటే నాణ్యతను, మార్క్ ఫెడ్ నిబంధనలను రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పొగాకు రైతులకు సుమారుగా రూ.500 కోట్లు నగదు రానున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్చూరు, చీరాల, బీకే పాలెం, గుంటూరు, ఎడ్లపాడు, గుడ్లవల్లి, పెదకాకాని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు మేలు
పొగాకు రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులకు రైతులు గురిగాకుండా ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, భూమి, వాతావరణ సమతుల్యతను బట్టి ఎలాంటి పంటలు సాగు చేయాలో ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, అధికారుల సూచన మేరకు రైతులు పంటల సాగు చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలూరి
రైతుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. చివరి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొనుగోలు సాధ్యం కాదని రైతులు అపోహ పడ్డారని, అసాధ్యాన్ని తమ ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. విదేశీ మరకద్రవ్యం అధికంగా వచ్చే బ్లాక్ బర్లీ పొగాకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా పొగాకు పంట సాగు చేశారని, వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. తదుపరి ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయం మేరకు పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రణాళికతో ముందుకు సాగాలని రైతులకు సూచించారు.
రైతుల కళ్ళల్లో కన్నీరు చూడరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్ తెలిపారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మార్క్ఫెడ్ ఎండి మంజీర్ జిలాని సమాన్ చెప్పారు. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఆదుకోవటానికే ప్రభుత్వం ముందుకు వచ్చి బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేస్త్తోందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, వేర్ హౌసింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్ఫెడ్ ఏడి కరుణశ్రీ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, జిల్లా సహకారశాఖ అధికారి శ్యాంసన్, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా అధికారులు, తదితర శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.