వైసీపీ అధినేత జగన్రెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినంగా పిలుపివ్వడం చూస్తే, ఆయనకు ఓటు వేయని ప్రజలే వెన్ను పోటు పొడిచారన్న అర్థం వస్తోంది. తన పాలనను ప్రజలు తిరస్కరించడాన్ని వెన్నుపోటుగా చిత్రించి ప్రజలనే దోషులుగా చింత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 4, భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయానికి ముగింపు పలికిన దినం. ప్రజల చేతుల్లోని ఓటు శక్తి, పాలకులపట్ల సమీక్ష హక్కు ఎంత బలంగా పనిచేస్తుందో మరోసారి నిరూపితమైన దినం. నిజానికి `నమ్మి అధికారమిచ్చిన ప్రజలనే జగన్రెడ్డి బలమైన పోటు పొడిచారు. జూన్ 4, ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మంచి పాలకులను ఎన్నుకొనే స్వేచ్ఛ ప్రజలకే వుంది. ప్రజలు 2019లో జగన్పార్టీకి 151 సీట్లిచ్చారు. అది వారి నమ్మకం.
అదే ప్రజలు 2024లో అత్యధిక స్థానాలను తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. అది ప్రజాభిప్రాయం, అనుభవం ఆధారంగా ఇచ్చిన తీర్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు దైవోపదేశమే. తను ఓటమి చెందితే అది ప్రజల వ్యతిరేకత కాదు, ప్రజలను వంచించిన పాలనకు చెల్లించుకున్న మూల్యం. జగన్ పాపాలను, అవినీతిని, అరాచకాన్ని, ఫాసిజాన్ని పాతరేసిన దినం. రాజధాని లేకుండా, పరిశ్రమలు, ఉద్యోగాలు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా, అభివృద్ధిని అడ్డుకున్న పాలనను ప్రజలు తిరస్కరించిన దినం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన పాలకులకు చరమగీతం పాడిన దినం. అసమర్థులను, అరాచకులను ఓడిరచి ప్రజలిచ్చిన తీర్పు.
వెన్నుపోటు దినం అనే అంశాన్ని చంద్రబాబుపై విమర్శనాత్మకంగా ప్రయోగించి రాజకీయ ప్రయోజనం పొందే రాజకీయ వ్యూహం. ప్రజలలో చంద్రబాబుపై వ్యతిరేకత పెంచేందుకు ఒక గుర్తుగా దీనిని వాడుతున్నారు. ప్రజల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టకుండా, వర్గ విభేదాలు, వ్యక్తిగత విమర్శలవైపు దృష్టి మళ్లిస్తున్నారు. జగన్ ప్రజలకు అన్యాయం జరిగిందనే కోణాన్ని ప్రజల్లో నాటాలని, నమ్మకద్రోహం అనే భావాన్ని జనంలో కల్పించాలని జగన్ వ్యూహం. ఈ రకమైన దినోత్సవాలు ప్రజల అవసరాలు తీర్చగలవా? ఇది నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందా? అనే ప్రశ్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రజలకు వచ్చే లాభమేమిటి? అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరయే సరికొత్త కార్యక్రమాలు చెయ్యాలి తప్ప జగన్నాటకాలు ఆడటమేమిటి?
ప్రజలు తనకి వెన్నుపోటు పొడిచినట్టు ప్రచారం చేయడం ప్రజాస్వామికతకు విరుద్ధం. ప్రజలు వెన్నుపోటు పొడవలేదు. జగన్ పాలనపై నమ్మకం పోయింది. ఓటమికి కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ప్రజలే వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేస్తూ ప్రజల తీర్పును అపహాస్యం చేయడం దురదృష్టకరం. ప్రజలు ఎప్పుడూ విజ్ఞతతో, అనుభవంతో ఓటు వేస్తారు. పాలకులు ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయవచ్చు కానీ పదేపదే మోసం చేయ్యడం సాధ్యం కాదు. ప్రజల తీర్పును వెన్నుపోటుగా చూపడం జగన్ ముఠా అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం. రాష్ట్రంలో ప్రజల అభిమతం ఎలా పనిచేస్తుందో, పాలనమీద ప్రజల విజ్ఞత ఎలా పనిచేస్తుందో నిరూపించిన దినం జూన్ 4. ఎందుకు ప్రజలు తన పాలనపై ఆశ వదిలేసుకొన్నారో అర్థం చేసుకొని, ప్రజాస్వామ్య తీర్పును గౌరవించటం నిజమైన ప్రజాస్వామ్యం. జగన్రెడ్డి ఈ మార్గంలో ఆలోచించాలి. లేకపోతే ఆయనే వాస్తవంగా ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచినట్టు అవుతుంది. జగన్కి మళ్లీ అధికారమిస్తే జరిగే పరిణామాలేమిటో జనం తెలుసుకొని విజ్ఞత ప్రదర్శించి విపత్తు నివారించుకొన్నారు.
విషపూరితమైన జె బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకున్న.. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసిన, ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్చగా కొల్లగొట్టిన జగన్ ముఠాను ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కారు. అధికారమదంతో ధర్మాన్ని విస్మరించి అధర్మ పరిపాలన చేసిన జగన్రెడ్డిపై జనాగ్రహం కట్టలు తెంచుకొన్నది. గత ఎన్నికలలో 151 సీట్లు ఒక్క వైసీపీనే గెలుచుకున్నది. ఐదేళ్ళు గడిచేసరికి మధ్యనున్న అయిదు అదృశ్యమై 11 సీట్లు మాత్రమే మిగిలాయి. యువత, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యావంతులు, వ్యాపారులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అవినీతి అసమర్ధ పాలనకు చరమగీతం పాడారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలలో ఒకే విధమైన విజయాన్ని కూటమి సాధించింది.
జగన్రెడ్డి మంత్రివర్గంలో ఉన్న 26మంది మంత్రులలో 24మంది ఘోర పరాజయం పాలయ్యారు. పాత 13 జిల్లాలలో 8 జిల్లాలలో వైసీపీ ఒక్క సీటు కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు 2024లో తమ తీర్పును తిరగరాశారు. తనకు తాను అపర దాన కర్ణుడిగా బిరుదు తగిలించుకొని ఊరేగినా జగన్ నిజ స్వరూపాన్ని జనం తెలుసుకున్నారు. పాలకులు ఎలా ఉండకూడదో తమ తీర్పు ద్వారా రుజువు చేశారు. ఎలాంటి వారు ముఖ్యమంత్రి అవకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. అధికారం ఉందని ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించిన వారినందరినీ ప్రజలు రాజకీయంగా మట్టుబెట్టారు. శాసనసభను కౌరవసభగా మార్చి తనను తీవ్రంగా అవమానించిన సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని చంద్రబాబు చేసిన శపథంలోని ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకొని చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. కక్షసాధింపు రాజకీయాలను జనం హర్షించబోమని ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులు అందించిన అద్భుత విజయం అది. ఓటర్లు సృష్టించిన ఆ నిశ్శబ్ద విప్లవంలో ప్రజలు గెలిచారు, రాష్ట్రం నిలబడిరది.
అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న దీక్షా దక్షలతో సుపరిపాలన, అభివృద్ధికి, పారదర్శకతకు పెద్దపీట వేయగల సమర్ధ నాయకుడు అయిన చంద్రబాబుకే పట్టంగట్టారు ప్రజలు. నవరత్నాలతో తలరాతలు మారుస్తానంటూ ఓటర్లను టోకున బురిడీ కొట్టించాలని చూసిన జగన్రెడ్డిని తలెత్తకుండా చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ధనం, మద్యం ఏరులై పారించినా, కులం మతం ప్రాంతమని రెచ్చగొట్టినా, అల్లర్లతో దాడులతో ఓటర్లను బెదరగొట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చూసినా.. ప్రజల విజ్ఞతే విజేతగా నిలిచింది. జగన్ అబద్దాలు, ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. కూటమిని గెలిపించుకోవాల్సిన చారిత్రిక అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ప్రజలు నీతికి, ధర్మానికి, సమర్ధతకు, విశ్వసనీయతకు పట్టంగట్టారు. వైనాట్ 175 అంటూ విర్ర వీగిన జగన్రెడ్డి కండ కావరాన్ని మొత్తం కరిగించారు ప్రజలు. నియంతలు ఎవరూ విజేతలుగా నిలవలేరు.
ధర్మబద్దంగా, న్యాయబద్దంగా రాజనీతిజ్ఞతతో పాలించే వారిని, దార్శనికులనే ప్రజలు గుర్తుంచుకొంటారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేలకోట్ల ప్రజాధనం దోపిడిచేసి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకొని ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలేదని ఆ సొమ్ముతోనే రాజకీయ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి జగన్ పొడిచింది వెన్నుపోటు! తండ్రి అధికారంలో లేకపోతే జగన్ అంత సంపద పోగుపడేదా? రాజకీయ పార్టీ స్థాపించేవాడా? ఇతరులను వెన్నుపోటుదారులుగా చిత్రించడానికి జగన్రెడ్డికి అర్హత ఉన్నదా? పాలనలో విఫలమై టక్కుటమార విద్యలతో, దగాకోరు విన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. 2019లో ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అన్ని పథకాలకు కోతలు పెట్టి అన్నీ వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు జగన్. ఆర్ధిక నేరగాళ్లు, రాజకీయ కేటుగాళ్లు, వెన్నుపోటుగాళ్లంతా జగన్ ముఠానే!!
`నీరుకొండ ప్రసాద్