అమరావతి (చైతన్య రథం): గామీణ మహిళల జీవితాలలో వెలుగులు పంచుతున్న గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఏర్పాటుకు కారణం తానవ్వడం ఆనందాన్నిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈమేరకు సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతం ఉట్నూరులో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యం. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)గా రూపాంతరం చెందింది. అప్పటినుండి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ది వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోంది. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ…. నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలో ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు… వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు అభినందనలు’ అని పేర్కొన్నారు.