అమరావతి (చైతన్యరథం): తెలుగింటి ఛానల్ ఈటీవీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ- మీటీవీ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ…మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. తెలుగు భాషకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ.. అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేదీ సాటి లేదు. పాడుతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఎన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చినా ఈటీవీ 9 పీఎం న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నెంబర్-1గానే నిలుస్తుంది. 9గంటల బులెటిన్ చూస్తే చాలు…రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనే విధంగా ఒక బ్రాండ్ను సృష్టించుకుంది. రామోజీరావు ఆశయాలను, ఆలోచనలను, విలువలను కొనసాగిస్తూ….నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగింది. సరికొత్త ఉత్సాహంతో, టీమ్ వర్క్ తో…ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతం అవ్వాలని, ప్రజలను మరింతగా అలరించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.