- పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు
- ఇకపై ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ
- పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాం
- మొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
- నూరుశాతం అక్షరాస్యతకై ప్రాజెక్ట్ అ – ఆ (అక్షర ఆంధ్ర)
- విద్యాశాఖ అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో శుక్రవారం 4 గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై మంత్రి లోకేష్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను అభినందించారు. డీఎస్సీ పరీక్షకు తొలిరోజు ఉదయం 88శాతం, సాయంత్రం సెషన్లో 86శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్, లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇకపై ప్రతిఏటా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే తమ లక్ష్యమని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. 27వేల మందికిపైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టాం. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4వేల మందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు.
రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో 15 – 59 సంవత్సరాల వయస్సు గలవారిలో ఇప్పటికీ 81లక్షల మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. భారదేశంలోనే వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉన్న నేపథ్యంలో ఇకపై మిషన్ మోడ్లో వయోజన విద్యా కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఉల్లాస్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో 3.95లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహించగా, 3.53 లక్షలమంది (90.12%) మంది పాసయ్యారని తెలిపారు. వయోజన విద్యా విభాగంలో 247 పోస్టులకుగాను 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా మంత్రి దృష్టికి తేగా, నూరుశాతం లక్ష్యాన్ని సాధించగలిగే అంకితభావం కలిగిన వారిని మాత్రమే పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో అక్షరాస్యతలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
నైపుణ్యం యాప్ను అప్గ్రేడ్ చేయాలి
సప్లయ్ ` డిమాండ్కు అనుగుణంగా స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ను ఏర్పాటుచేయాలని, నైపుణ్యం యాప్ను అప్గ్రేడ్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. నైపుణ్యం పోర్టల్లో అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్థ్య పరీక్ష, సర్టిఫికేషన్, ఉద్యోగ కల్పన, పరిశ్రమల అనుసంధానం, పరిశ్రమల్లో ఖాళీల వివరాలు మొదలైన వాటిని పొందుపర్చాలని అన్నారు. సెక్టార్ వైజ్ ప్లేస్మెంట్స్, జాబ్ మేళాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చాలన్నారు. నైపుణ్యం యాప్ ద్వారా ఈ ఏడాది 6,83,052 మంది దరఖాస్తు చేసుకోగా, 6,45,163 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, వారిలో 77,703 మందికి ఉద్యోగాలు లభించాయని ఎపిఎస్ఎస్డిసి సిఇఓ గణేష్ కుమార్ తెలిపారు.
త్వరలో ఆటిజం సెంటర్లు
రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఆటిజంతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఈ సెంటర్లలో నిపుణులను ఎంపిక చెయ్యాలని ఆదేశించారు. ఆటిజంపై ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల కమిటీ సలహాలు తీసుకోవాలని సూచించారు. అన్ని త్వరితగతిన విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందేలా చూడాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాస్ను ఆదేశించారు.
కాలేజీ స్థాయిలోనే నైపుణ్య శిక్షణ
ఉన్నత విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తూ… యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొంది ఉద్యోగం సాధించే దశకు చేరుకునేలా ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన నైపుణ్యశిక్షణ కార్యక్రమాలను కాలేజ్ స్థాయిలోనే పెద్దఎత్తున చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల వీసీ పదవులకు సెర్చి కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తిని కోరారు. చైర్మన్ స్పందిస్తూ… ఈ నెలాఖరులోగా ఆయా వర్సిటీలకు సెర్చి కమిటీ సిఫారసులను పంపిస్తామని తెలియజేసారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని మంత్రి సూచించారు. ఇందులో గవర్నింగ్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అకడమిక్ కౌన్సిల్, తదితర విభాగాలు ఉంటాయని మంత్రికి మధుమూర్తి వివరించారు. ఎప్ సెట్, లా సెట్, పిజి సెట్ వంటి ప్రవేక్ష పరీక్షలను నిర్ణీత క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నామని, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలియజేసారు. విద్యార్థుల నమోదుకై అపార్ ఐడి 98శాతం పూర్తిచేశామని, త్వరలో నూరుశాతం పూర్తిచేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చి (నైపర్) ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఫారిన్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులపై మంత్రి సమీక్షించారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న జాయింట్ సిర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ (జేసిడి) నిబంధనలను సడలించే అంశం పై చర్చించారు. నాణ్యత పై ఎటువంటి రాజీ లేకుండా ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చే ఎన్ఓసి లు మరింత సులభతరంగా అందజేయాలని ఆదేశించారు. అలాగే కనిగిరి త్రిపుల్ ఐటి ఏర్పాటు పై సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, కళాశాల విద్య డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి, ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఇఓ గణేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.