- సమగ్రశిక్షకు గతంకంటే అదనంగా కేంద్ర నిధులు
- మంత్రి లోకేష్ చొరవతో ఏపీకి అధిక ప్రాధాన్యం..
అమరావతి (చైతన్య రథం): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న విద్య, ఐటీ మంత్రి లోకేష్ సంకల్పానికి కేంద్రం మద్దతుగా నిలుస్తోంది. సమగ్రశిక్షకు గతంలోకంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. దేశానికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ దిక్సూచిగా మారాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష వంటి వినూత్నమైన కార్యక్రమాలతో.. విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా అడుగులేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్షకు కేంద్రంనుంచి నిధులు మంజూరయ్యాయి. మంత్రి లోకేష్ చొరవతో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోంది.
ఐసీటీ ల్యాబ్లు, స్మార్ట్ క్లాసెస్కు రూ.167.46 కోట్ల అదనపు నిధులు మంజూరు
సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులను బలోపేతం చేయడానికి ఐసీటీ ల్యాబ్లు, స్మార్ట్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటుకు కేంద్రం రూ.167.46 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. దీంతోపాటు డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చడానికి గతంలో 50 శాతం మాత్రమే నిధులు రాగా, ఈ ఏడాది రూ.45 కోట్లకుగానూ 96శాతం అంటే రూ. 43.23 కోట్ల నిధులు మంజూరు చేసింది. దశలవారీగా ఇతర డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు తగిన నిధులు మంజూరు చేయనుంది.
ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాలకు రూ.11 కోట్లు
ధర్తి అబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డిఏజెజియుఏ) పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ విద్యార్థుల కోసం 4 వసతి గృహాలను నిర్మించేందుకు కేంద్రం రూ.11 కోట్లు నిధులు మంజూరు చేసింది. గిరిజన తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2024-25 నుంచి 2028-29 వరకు ఐదేళ్ల కాలానికి ఈ పథకం అమలు చేయనున్నారు. గిరిజన మెజారిటీ గ్రామాలన్నింటిలోనూ సంపూర్ణ అభివృద్ధిని సాధించడం, వారికి మెరుగైన మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి
అవకాశాలను కల్పించడం కార్యక్రమం ముఖ్య లక్ష్యం.
జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ పథకం కింద రూ.210.5 కోట్లు మంజూరు
ప్రధాన మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా రెండు దశల్లో మొత్తం 79 హాస్టళ్లు నిర్మించేందుకు కేంద్రం రూ.210.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత ఏడాది నాలుగు హాస్టళ్లు మాత్రమే మంజూరు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 79 హాస్టళ్లు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపి నిధులు కేటాయించింది.
పీఎంశ్రీ కింద అదనంగా 80 పాఠశాలలు ఎంపిక
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలో ఈ ఏడాదికి మొత్తం 80 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేసింది. వీటికి ఇంకా నిధులు కేటాయించాల్సి ఉంది. రాష్ట్రంలో మొదటి దశలో 662 పీఎంశ్రీ పాఠశాలలు, రెండో దశలో 193 కలిపి మొత్తం 855 పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేయగా.. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ విద్యా సంవత్సరం అదనంగా మరో 80 పీఎంశ్రీ పాఠశాలలను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలలుండగా.. అత్యధికంగా ఏపీకే 935 పీఎంశ్రీ పాఠశాలలను కేటాయించడం జరిగింది. మొత్తం మీద మంత్రి నారా లోకేష్ కృషి కారణంగా సమగ్రశిక్ష కింద రాష్ట్రానికి అదనంగా రూ.432.19 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.