- గిట్టుబాటు ధరకు కొనుగోలు
- రైతు బజార్లలో అమ్మకాలు
- ఎంఐఎస్ కింద నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా కొనుగోలు
- ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
- అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేపట్టాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టమాటా రైతులను ఆదుకొనేందుకు తీసుకొనే చర్యల్లో భాగంగా ధర చాలా తక్కువగా పలుకుతున్న అనంతపురం జిల్లా నుండి ప్రభుత్వమే టమాటాను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి (సుమారుగా కిలో రూ.8) రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లకు సరఫరా చేస్తుందని చెప్పారు. శుక్రవారం సుమారుగా 1000 క్వింటాళ్ళ టమాటాను అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించారన్నారు. వీటిలో విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుండి సేకరించిన టమాటాలను విశాఖపట్టణం, రాజమండ్రి రైతబజార్లకు.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు రైతుబజార్లకు తరలించి అమ్మకాలు జరిపారు. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వినియోగదారులకు కూడా టమాటా ధరలు అందుబాటులో ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వ పథకం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్)లో భాగంగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న టమాటాలను అన్ని ఆపరేషనల్ ఖర్చులను వారే భరించే విధంగా సేకరించి, కొరత ఉన్న ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో విక్రయించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకున్నాము. దీనివల్ల రైతులకు కిలో టమాటా ధర సుమారు రూ.10 నుండి రూ.15 వరకు అందుతుంది. ఇంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా ఈ టమాటోలను పంపి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని రైతన్నలను ఆదుకోవాలని కలెక్టర్లకు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారు.