విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖలో ఈ నెల 21న కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరయ్యే విద్యార్థుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమం సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో విశాఖ నోవాటెల్ హోటల్లో సోమవారం జరిగిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. యోగా దినోత్సవ ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. విద్యార్థుల విషయంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక సంరక్షకుడిని నియమించాలని సూచించారు. బస్సుల కండిషన్ను ముందుగానే పరీక్షించాలన్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.