- ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణకు అవకాశం
- పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్తో అనుసంధానం
- నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
- పోర్టల్ డెమోను పరిశీలించిన మంత్రి
ఉండవల్లి (చైతన్యరథం): ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నైపుణ్యం పోర్టల్ను దేశానికే రోల్ మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో మంత్రి నారా లోకేష్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యం పోర్టల్ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సెప్టెంబర్లో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్తో నైపుణ్యం పోర్టల్ ను అనుసంధానించాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ డెమోను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్ను అభివృద్ధి చేయలేదని, రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలతో పాటు న్యాక్, సీడాప్ను పోర్టల్ తో అనుసంధానించనున్నట్లు అధికారులు వివరించారు. ఏడాదికి 50వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే 36 రంగాలకు సంబంధించి 3వేలకు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్లో ఎన్ రోల్ చేసినట్లు వివరించారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా యువతను సన్నద్ధం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఇదే సమావేశంలో ఇంటర్ విద్యకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దృష్టి లోపం గల విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు అనుమతి మంజూరు చేసారు. వారికి మరిన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. అక్షర ఆంధ్రలో భాగంగా 16 లక్షల మందిని గుర్తించామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారందరికీ వయోజన విద్యా శిక్షణ తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రఘు, ఏపీఎస్ఎస్డీసీ అసోసియేట్ డైరెక్టర్ కుమార పురుషోత్తం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.