మొక్కు చెల్లించుకున్న గాయని వరలక్ష్మి
అభిమానిని కలిసి మురిసిపోయిన చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ఏపీకి చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తనా గానం చేస్తానని మొక్కుకున్న గాయని వరలక్ష్మీ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలనేదే తన బలమైన నమ్మకమని తెలిపారు. అందుకే చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ 108 దేవాలయాల్లో సంగీత కచేరీలు చేస్తానని మొక్కుకున్నట్టు సీఎంకు వివరించారు. మంగళగిరిలో పుట్టిన తాను ముంబైలో స్థిరపడ్డానని.. కానీ జన్మభూమిపై మమకారాన్ని వదులుకోలేదని వరలక్ష్మీ చెప్పారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొక్కు చెల్లించుకునేందుకు అన్నవరం దేవస్థానంలో తొలి కచేరీ నిర్వహించానని.. ఏపీతోపాటు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తాను సంగీత కచేరీ నిర్వహించానని సీఎంకు చెప్పారు. చివరి కచేరీ దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తాను నిర్వహించిన కచేరీల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కచేరీలకు సంబంధించి వరలక్ష్మీ రాసుకున్న పుస్తకాన్ని సీఎం పరిశీలించి సంతకం చేశారు. తనపట్ల వరలక్ష్మీ చూపిన అభిమానానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకున్న వరలక్ష్మీలాంటివాళ్లు తనకు అండగా నిలవడం, రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్ధించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మీలాంటి అభిమానులు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తానని చంద్రబాబు చెప్పారు. వరలక్ష్మీతోపాటు ఆమె సోదరుడు శ్రీ భాష్యం రంగనాథ్ సీఎం చంద్రబాబును కలిశారు.