- ఐటీిఐలో రెన్యువబుల్ ఎనర్జీ నైపుణ్య శిక్షణకు అంగీకారం
సింగపూర్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్లో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఈ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఎవర్వోల్ట్ కంపెనీ చైర్మన్ సైమన్ టాన్కు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్తో సింగపూర్లో భేటీ అయిన మంత్రి లోకేష్ 2029నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ` 2024ను ప్రకటించాం. రెన్యూ, సుజలాన్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్లో భారీస్థాయిలో సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్వోల్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయండి. ఏపీలోని ఐటీిఐల్లో రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్కు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై ఎవర్ వోల్ట్ చైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ… ఏపీలో ఎంపికచేసిన ఒక ఐటిఐలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ సంస్థ… సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజి ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 1 గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ… 2026నాటికి 3 గిగావాట్ల చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.