- బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం
- గీత కార్మికులకు ఉపాధి పెంచేలా నూతన ఉత్పత్తుల రూపకల్పన
- ఆదరణ 3.0 పథకం ద్వారా మోపెడ్లు అందజేత
- రంపచోడవరం హార్టీకల్చర్ పరిశోధనా కేంద్రంలో తాటి ఉత్పత్తుల తయారీ
- జయంతి ఉత్సవాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
విజయవాడ (చైతన్యరథం): బడుగు, బలహీన వర్గాల కోసం డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం పాడుపడ్డారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత అన్నారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ గౌతు లచ్చన్న 116వ రాష్ట్ర స్థాయి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బడుగు వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. గౌతు లచ్చన్న పోరాట యోధుడే కాదు గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, హరిజన, గిరిజన రక్షణ యాత్రలు నిర్వహించారన్నారు. గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.త్వరలోనే ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించనున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్ ద్విచక్ర వాహనాలు అందజేయబోతున్నామన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే బీసీలంతా ముఖ్యమంత్రికి అండగా నిలబడాలన్నారు. గీతకార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు అందజేయనున్నామన్నారు. రంపచోడవరంలో హార్టీకల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారుచేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
బీసీలకు అండగా ప్రభుత్వం: మంత్రి అనగాని
రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే ఈ కార్యక్రమం అన్నారు. బిరుదులు అందరికీ ఇస్తారు.. కొందరు మాత్రమే స్వతహాగా సాధిస్తారన్నారు. లచ్చన్నకు అలా వచ్చిందే సర్దార్ అనే బిరుదు అన్నారు. వెనుకబడిన వర్గాల కోసం, అంటరానితనం పై పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఏవిధంగా అండగా ఉంటున్నదో ప్రజలు చూడాలన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయించడం అభినంధనీయమన్నారు. బీసీ వర్గాల పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
చిరస్మరణీయుడు: పల్లా
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడిన వ్యక్తులను ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అలా గుర్తుండిపోయే నాయకులు గౌతు లచ్చన్న అని, ఆయన ఆశయాలను ఇకముందూ కొనసాగిస్తామన్నారు. లచ్చన్న మార్గంలోనే అణగారిన వర్గాల అభ్యున్నతికి టీడీపీ తొలినుండీ కృషి చేస్తోందన్నారు.
పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య ఎన్.జీ. రంగాను పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళంలో నిలబెట్టి గెలిపించిన వ్యక్తి లచ్చన్న అని తెలిపారు. గౌతు లచ్చన్న అడుగుజాడల్లో నడుస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తి అందిస్తామన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ గుర్తింపు కావాలని కోరుకున్న వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్నఅన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఆయన జీవితం ఎంతోమంది మాలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు..
గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజా పోరాటాలు చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చిన్నప్పుడు తాను తాత దగ్గర పెరగడం వల్ల.. ఆయన ఆశయాలు, ఆలోచనలు తనపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. విలువలతో, నిజాయితీతో పని చేసిన గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గౌతు లచ్చన్నను గౌరవించకపోగా మా కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. గౌతు కుటుంబానికి రాజకీయ వారసురాలుగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తాత, తండ్రి నేర్పిన విలువలతోనే రాజకీయం చేస్తానన్నారు…
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, పితాని సత్యన్నారాయణ, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, వర్ల కుమార్ రాజా, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి సహా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, అధిక సంఖ్యలో గీత కార్మికులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.