- పోరాటాలే ఊపిరిగా బతికిన నాయకుడు
- అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి
- రైతులు, వెనుకబడిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు
- ఆయన జీవితం యావత్ జాతికి స్ఫూర్తిదాయకం
- జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది
లచ్చన్న జయంతి వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ (చైతన్యరథం): సమాజంలో అసమానతలను తొలగించేందుకు డా. సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు, రైతు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన నిరసనలు, నిరాహార దీక్షలు, రైలురోకోలు ఆయన ధైర్యసాహసాలకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గౌతు లచ్చన్న పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాడారని అందుకే ఆయనను నేటికీ ఉద్యమాల నిప్పుకణికగా గౌరవంగా స్మరించుకుంటున్నామన్నారు. సర్ధార్ గౌతు లచ్చన్న 116 జయంతిని బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హజరై సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న పేరు అజరామరం అని, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహానుభావుడు లచ్చన్న అని అన్నారు. తెలుగునాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన రోజుల నుండే లచ్చన్న జీవితానికి ఉద్యమాలే పునాది అన్నారు. సాదాసీదా కుటుంబంలో పుట్టినా, లక్ష్యమున్న నాయకుడిగా ఎదిగి, న్యాయం కోసం దృఢంగా నిలబడిన లచ్చన్నకు ‘‘సర్ధార్’’ అన్న బిరుదును ప్రజలే అందచేశారని తెలిపారు. రాజకీయాల్లో ఎప్పటికీ మాయమవని వెలుగుదీపంలా ఆయన కీర్తి నిలిచిపోయిందని, నిజాయితీ, అంకితభావం, ధైర్యం ఈ మూడు గౌతు లచ్చన్న వ్యక్తిత్వానికి ప్రతిరూపాలని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు.
యావత్ జాతికి స్ఫూర్తిదాయకం
ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన లచ్చన్న, యావత్ జాతికి స్ఫూర్తి ప్రదాతగా అని మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వం స్థిరంగా నిలబడతాయి. లచ్చన్న ఆలోచనలు, ఆయన పోరాట పటిమ కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తాయి. ఆధునికత, గ్లోబలైజేషన్ ప్రభావంతో మారుతున్న విలువల మధ్య యువతకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అలాంటి సందర్భంలో గౌతు లచ్చన్న జీవితం ఒక మార్గదర్శక దీపం. ఆయన జీవితం ద్వారా త్యాగం అంటే ఏమిటో, నిజమైన ప్రజాసేవ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. సమాజంలో శాశ్వత మార్పు రావాలంటే త్యాగం, పట్టుదల, నిజాయితీతో కూడిన నాయకత్వం అవసరం. అలాంటి అసమాన్య నేతలలో సర్దార్ గౌతు లచ్చన్న ఒకరు. ఆయన జీవితం మొత్తం పేదల కోసం, కూలీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం అంకితం చేశారు. సాధారణ కుటుంబం నుండి వచ్చినా, సమాజంలో న్యాయం నెలకొల్పడమే తన కర్తవ్యమని భావించి, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యశీలి ఆయన. గౌతు లచ్చన్న జీవితం ఒక ఉద్యమ గాథ. సామాన్య ప్రజల కోసం, బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని ధీరత్వం ఆయన సొంతం. రాజకీయాలను ఆయన అధికారం కోసం ఒక మార్గంగా చూడలేదు. ప్రజాసేవ కోసం వేదికగా భావించారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడమే ఆయన ప్రధాన ఆశయం అని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు.
రైతు హక్కుల కోసం నిరంతర పోరాటం
రైతు పట్ల ఆయనకున్న అనుబంధం అంతులేనిది. రైతు హక్కుల కోసం న్యాయస్థానాల వరకు వెళ్లి పోరాడిన వ్యక్తి ఆయన. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే రైతు బలపడాలనేది ఆయన సిద్ధాంతం. పేద కూలీలకు, శ్రామికులకు, గిరిజనులకు జీవితాంతం అండగా నిలిచిన నాయకుడు. స్వాతంత్య్రం వచ్చాక పేదల సంక్షేమమే లక్ష్యంగా లచ్చన్న కృషి చేశారు. రైతులు, కూలీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వీరందరికీ న్యాయం చేయడమే ఆయన జీవిత ధ్యేయం. పదవుల కోసం ఆయన పోరాడలేదు, ప్రజల కోసం పోరాడారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్ని సార్లు ఎన్నికైనప్పటికీ, ఆయన గళమెత్తింది ఎప్పుడూ బలహీన వర్గాల కోసం మాత్రమే. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దృఢ సంకల్పంతో ఆయన చేసిన పోరాటానికి ‘సర్దార్’ బిరుదు లభించింది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ సమయంలో తెలంగాణ ప్రాంతానికి హామీలు ఇవ్వడంలో ఆయన చూపిన కట్టుబాటు ఆయన దూరదృష్టిని తెలియజేస్తుంది. పదవులు కోల్పోయే పరిస్థితి వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇది నిజమైన నాయకత్వానికి నిదర్శనం. ఆయన జీవితం ఒక ప్రజాసేవా గాథ. తోటపల్లి జలాశయానికి ఆయన పేరు పెట్టడం చిన్న విషయం కాదు, ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో రాష్ట్రం గుర్తించిందనేందుకు నిదర్శనంగా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఎన్జీ రంగా శిష్యుడిగా..
ప్రజాస్వామ్యానికి ప్రజలే కేంద్రబిందువు అని ఆయన గట్టిగా నమ్మారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయన జీవితం అంతా ప్రజల కోసం అంకితమయింది. సుదీర్థ కాలం శాసనసభ్యులుగా పనిచేసి ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారు. 1978లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, పిఏసి ఛైర్మన్గా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా విశేష సేవలను అందించారని తెలిపారు. ఆయన తరం నాయకులు ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం వెనక్కి తగ్గలేదు. అందుకే ఆయన పేరు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్జీ రంగా కోసం పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి అదే స్థానంలో ఎన్జీ రంగాను గెలిపించుకొని గురుభక్తిని చాటుకున్నారని కొనియాడారు. ఆయన త్యాగస్ఫూర్తి, సేవాసంకల్పం, ప్రజానుకూల ఆలోచనలు మనందరికీ ఎప్పటికీ ఆచరణీయం. జీవితాంతం దేశానికి అంకితభావంతో సేవ చేశారని, యువతకు ప్రేరణగా నిలిచారని దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడయ్యారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
బీసీల అభివృద్ధికి కట్టుబడిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గాల అభ్యున్నతికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, వారిని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బలోపేతం చేసే దిశగా కట్టుబడి ఉంది. తెలుగుదేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు తొలిసారిగా బీసీలకు గౌరవప్రద స్థానాలు కల్పించి, వారికి రాజకీయ శక్తి ఇచ్చారు. ఆ మార్గాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు మరింత బలపరుస్తూ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు, వృత్తుల వారీగా అభివృద్ధి పథకాలు, విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి రంగంలోనూ బీసీలకు సమాన అవకాశాలు కల్పించడం తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. బీసీల పురోగతి లేకుండా సమాజ పురోగతి అసాధ్యం. బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల్లా శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పలాస, విజయవాడ సెంట్రల్, పెడన ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బోండా ఉమా మహేశ్వరరావు, కాగిత కృష్ణ ప్రసాద్, బీసీ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
“`