- రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం
- 72 లక్షల మందికి వైద్య పరీక్షలతో హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తాం
- సంజీవని’కి సహకారంపై త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక
- కుప్పంలోని తుమ్మిశిలో ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు
కుప్పం (చైతన్యరథం); రాష్ట్రవ్యాప్తంగా 72లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజ కర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ గ్రామంలోని ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించారు. సంజీవని ప్రాజెక్టు అమలు గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వివిధ అంశాలను తెలుసుకున్నారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వివిధ ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు.వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు నిపుణులైన వైద్యులతో పాటు ఔషధాలను ఇచ్చేలా సంజీవని ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అత్యుత్తమ టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్య అంశాలను పర్యవేక్షించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు.
బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ సహకారంతో ఈ డిజి నెర్వ్ సెంటర్ ద్వారా ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు అమలుతో పాటు మరిన్ని రంగాల్లో సహకారం అందించేందుకు త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని సీఎం వివరించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవని ని ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించామని.. ఈ ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో నమోదు అయిన వైద్య పరీక్షల వివరాలను డిజిటల్ గా మార్చామని అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను విశ్లేషించి చికిత్సలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిపుణులైన వైద్యుల ద్వారా వారికి చికిత్స చేయించడంతో పాటు ఔషధాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సంజీవని సేవల్ని సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుప్పం నియోజకవర్గంలో 80 వేల మంది హెల్త్ రికార్డులను తయారు చేశామని ఆయన వెల్లడించారు.
ఆరోగ్యపరమైన అంశాలపై స్కోరింగ్
వైద్య పరీక్షల అనంతరం వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించి స్కోరింగ్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం వివరించారు. 42 రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. డయాబెటిస్, బీపీ, అనీమియా, హృద్రోగం, తదితర అనారోగ్య సమస్యలకు సంబంధిత వైద్య నిపుణులతో ఔషధాలను ఇప్పించటంతో పాటు ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని అన్నారు. త్వరలో వైద్య సలహాల కోసం ఏఐ డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిజి నెర్వ్ సెంటర్ ద్వారా ఒక్క క్లిక్ తోనే వైద్యులు రోగులకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునేందుకు అవకాశం ఉందన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా నమోదు చేసిన తుమ్మిశి గ్రామస్థుల డిజిటల్ హెల్త్ రికార్డులను వారి ఆరోగ్య వివరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొందరు అనీమియా లోపంతో బాధపడుతున్న మహిళలు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటున్న వారితో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించటంతో పాటు వైద్య నిపుణుల సేవలు అందేలా చూడాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. తుమ్మిశి గ్రామంలో ఇటీవల గుండెపోటు తో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.















