- అమరావతి నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం
- 17న క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధం
- ఆ వెంటనే పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం
- క్యాపిటల్ సిటీ నిర్మాణ ఖర్చు రూ.64వేల కోట్లు
- ప్రజా పన్నుల నుంచి తీసేది లేదన్న ముఖ్యమంత్రి
- సమీకరించిన భూములనుంచే నిధుల సమీకరణ
- పురపాలక, పట్టణాభివృద్ది మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సీఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం వివరాలను మున్సిపల్ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడిరచారు. దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన 59 టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో వీటన్నింటికీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20 వేలమంది అమరావతి అభివృద్ది పనుల్లో పాల్గొంటారని తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 45వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సీఆర్డీఏ మరియు క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వీటిలో దాదాపు రూ.37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి నేడు సీఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందామన్నారు. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు.
మొత్తం 59 పనుల్లో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ.22,607.11 కోట్లని, ఏడిసికి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ.15,095.04 కోట్లని వెల్లడిరచారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులుకాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశామని, మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను 17న తెరుస్తామన్నారు. ఇవికాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసంధానించే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి 2014-19 మధ్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించడం జరిగిందన్నారు.
2014-19 మధ్యకాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించడం జరిగిందని, ఈ అంశంపై సోమవారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు నేడు జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం పొందామన్నారు. రెండు సంస్థలకు స్థలం మార్పునకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతోపాటు కాలపరిధిని కూడా పొడిగించడం జరిగిందన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్దికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చువుతుందని, అందుకు రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేసే పన్నులనుండి ఏమాత్రము ఖర్చుపెట్టే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టే జరుగుతుందన్నారు. రైతులనుండి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సీఆర్డీఏకు మిగిలిందని, అందులో దాదాపు 1900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవి అన్నీపోగా ఇంకా సీఆర్డీఏ వద్ద అభివృద్ది చేయబడిన స్థలం దాదాపు 4,000 ఎకరాలు ఉంటుందన్నారు. ఆ భూమి తనకా పెట్టడం ద్వారా మరియు వేలంపాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మించడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుండి రూ.15 వేల కోట్లు మేర ఋణాన్ని తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, వివిధ బ్యాంకుల ద్వారా రూ.5 వేల కోట్లమేర రుణాన్ని తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. ఈవిధంగా దాదాపు రూ.31 వేల కోట్లను సమీకరించడం జరిగిందని, ఆ నిధులతో పనులను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ అభివృద్ది పనుల వల్ల భూమి రేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు భూములను వేలంద్వారా అమ్మి వచ్చిన సొమ్ముతో అసలు, వడ్డీలను కూడా తీర్చేయడం జరుగుతుందన్నారు. వివిధ బ్యాంకుల నుండి సమీకరిస్తు రుణాలనుండే వెచ్చించేందుకు బడ్జెట్లో రూ.6 వేలకోట్లను అమరావతి అభివృద్ది పనులకు చూపడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్నిరకాల భూములు కలుపుకుని దాదాపు 53,500 ఎకరాలు ఉందని, అందులో 30 శాతం వరకూ గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడిరచారు.