అమరావతి (చైతన్య రథం): అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు సురేశ్కుమార్, ఆకే రవికృష్ణలు ఈ ఘటనపై విచారణ నివేదికను అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పేలుడు ఘటనపై విచారణ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రంతోపాటు పేలుడు పదార్ధాలను కూడా అక్కడే నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. ఒకే షెడ్డులో ఒకేచోట 14మంది కార్మికులు వీటిని తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని నివేదికలో పేర్కోన్నారు. బాణా సంచా తయారీలో ఇనుప పరికరాలు వినియోగించటం వల్లే రాపిడికి మంటలు రేగి ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుందని స్పష్టం చేశారు. తయారీ కేంద్రంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని సీఎంకు వివరించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా బాణాసంచా తయారీపై పర్యవేక్షణ
భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాణా సంచా తయారీ కేంద్రాలకు లైసెన్సు ఇచ్చేముందు.. తర్వాత నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. అలాగే బాణాసంచా తయారీలో వినియోగించే పదార్థాల కొనుగోలు, తయారీ వివరాలు ఆన్లైన్లో ఉండేలా చూడాలని సూచించారు. నిబంధనలు ప్రకారంలేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని సీఎం స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాణా సంచా తయారీ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండేలా చూడాలని.. అందులో పనిచేసే వారికి వ్యక్తిగత బీమా తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షకు హెూంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.