- రూ.22వేల కోట్లతో అనంతపురం జిల్లాలో ఏర్పాటు
- దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా ఆవిర్భావం
- 16న ఐటీ మంత్రి లోకేష్ శంకుస్థాపన
- ప్రజా ప్రభుత్వంలో పెద్దఎత్తున తరలివస్తున్న పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ఐసీఈ)తో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈనెల 16న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా నడుమ జరిగిన వ్యూహాత్మక చర్చలు ఫలించడంతో లోకేష్ ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది.
రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు తొలిదశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లపై మొత్తంగా 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్గా ఆవిర్భవించడమేగాక ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధనరంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న రెన్యూ… ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధానాలతో పెట్టుబడులు పెట్టడం ఆపేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసింది. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం జీరోస్థాయికి పడిపోయింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంధన రంగం మళ్లీ పట్టాలెక్కింది. గత ఏడాది అక్టోబర్లో క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను దావోస్ చర్చల్లో మంత్రి లోకేష్ రెన్యూ పవర్ చైర్మన్కు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు పునరుత్పాదక ఇంధనరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేయడమేగాక పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపాయి. దీంతో పునరుత్పాదక ఇంధనరంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. దీంతో పునరుత్పాదక ఇంధనరంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.
రాష్ట్రవ్యాప్తంగా రూ.65వేలకోట్లతో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకురాగా, కనిగిరిలో తొలిప్లాంట్కు మంత్రి లోకేష్ ఇటీవల భూమిపూజ చేశారు. టాటా పవర్ (7వేల మెగావాట్లు, రూ.49వేలకోట్ల పెట్టుబడి), ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు (రూ.1.86లక్షల కోట్లు), వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా (10వేల మెగావాట్లు, రూ.50వేల కోట్లు), ఎస్ఎఈఎల్ ఇండస్ట్రీస్ (1200 మెగావాట్లు, 6వేలకోట్ల పెట్టుబడులు), బ్రూక్ ఫీల్డ్ (8వేల మెగావాట్లు, రూ.50వేలకోట్ల పెట్టుబడి) తదితర ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో గ్రీన్ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా నిలవనుంది.