- సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ క్యాంపైన్లో విద్యార్థులు
- పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు అందజేత
అమరావతి (చైతన్య రథం): భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలవల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా..? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నాశాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని.. దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్టు… సంస్కరణలను ఇప్పుడు అమలుచేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం… వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.