- కేంద్రంతో నిరంతర సంప్రదింపులు
- కొలిక్కివస్తున్న మంత్రి లోకేష్ ప్రయత్నాలు
- త్వరలో ఫలించే అవకాశం
రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అలుపెరుగని కృషి చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ, సంబంధిత ఉన్నతాధికారులతోనూ, సంస్థలతోనూ నిరంతరం సంప్రదింపులు సాగిస్తున్నారు. విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్డీటీ సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. త్వరలో ఆర్డీటీ సేవలు, కార్యకలాపాలు యథావిధిగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆర్డీటీ సంస్థకు విదేశాలనుంచి వచ్చే నిధుల వినియోగాన్ని ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కేంద్రం నిలిపేయడంతో ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో ఉన్న నిధులను సంస్థ వినియోగించడానికి వీలు లేకుండా పోయింది. దీంతో లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో ఉన్న నిధులనే సేవా కార్యక్రమాలకు వాడాల్సి వస్తోంది. ఫలితంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో ఈ సంస్థ చేపడుతున్న విద్య, వైద్యం, స్వయంఉపాధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదమేర్పడిరది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
యువగళం పాదయాత్ర సమయంలో అనంతపురంలో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను యువనేత నారా లోకేష్ ప్రత్యక్షంగా చూశారు. ప్రభుత్వంతో సమాంతరంగా విద్య, వైద్య, ఉపాధి రంగాల ద్వారా పేదలకు ఆర్డీటీ అందిస్తున్న నిస్వార్థ సేవలను చూసి, తాము అధికారంలోకి వచ్చాక ఆర్డీటీ సేవలు విస్తరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కూటమి ప్రభుత్వం కొలువయ్యాక ఆర్డీటీ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్.. మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. రూరల్ డెవలప్మెట్ ట్రస్ట్.. సేవలు విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆ సందర్భంగా మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ఆర్డీటీ నిర్వహిస్తున్న ఆసుపత్రుల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఎఫ్సీ ఖాతాలో కాకుండా ఎల్సీ ఖాతాలో జమ చేశారనే అభియోగంపై కేంద్రం ఫారిన్ కంట్రిబ్యూషన్ నిధులు వినియోగానికి అనుమతులు నిరాకరించింది. ఆర్డీటీకి వస్తున్న నిధులను ఇతర ఎన్జీవోలు చేపట్టే కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారనే ఆరోపణలతో ఆంక్షలు విధించడంతో ఆర్డీటీ సేవలు ప్రశ్నార్థకమయ్యాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సేవలందిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని బత్తలపల్లి, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600కుపైగా పడకలతో మూడు ఆసుపత్రులను ఆర్డీటీ నిర్వహిస్తోంది. ఏటా 8.5 లక్షల మంది అవుట్పేషెంట్లు, 60 వేలకుపైగా ఇన్పేషెంట్లకు సేవలందిస్తోంది. కరోనా సమయంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని కొవిడ్ సెంటర్గా మార్చి పది వేల మందికి చికిత్స అందించింది. మూగ, చెవిటి, మానసిక వికలాంగులైన విద్యార్థులకు అనంతపురంలో మూడు ప్రాథమిక, రెండు ఉన్నత పాఠశాలలను ఆర్డీటీ నిర్వహిస్తోంది. కేంద్రం ఆంక్షలతో ఇప్పుడు ఈ సేవలన్నీ నిలిచిపోయే ప్రమాదమేర్పడిరది.
తెలుగు రాష్ట్రాల్లో పేదల పాలిట వరంగా మారిన ఆర్డీటీ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు , మరింత విస్తృత పరిచేందుకు తన వంతు సాయం అందిస్తానని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్డీటీ సేవలకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయి…మళ్లీ యథావిధిగా సేవలు కొనసాగేలా నారా లోకేష్ చేస్తున్న కృషి త్వరలో ఫలించనుందని విశ్వసనీయ సమాచారం.