- ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియా హైకమిషన్
అమరావతి (చైతన్య రథం): విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో భాగస్వాములవ్వాలంటూ మంత్రి లోకేష్కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈమేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈమేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని, 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఎస్వీపీ’లో భాగస్వాములయ్యారని వెల్లడించింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో భాగస్వామ్యం కావడం ద్వారా ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు.. ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుంది.