- నూతన పోర్టులకు రైల్వే కనెక్టివిటీ రావాలి
- ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా విజయవాడ, విశాఖ, తిరుపతి
- రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదన
అమరావతి (చైతన్యరథం) రాష్ట్రంలో నూతనంగా నిర్మించే పోర్టులను కూడా అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మూలపేట, విశాఖ, కాకినాడ, రామాయపట్నం, తదితర పోర్టులకు కనెక్టివిటీని పెంచేలా లైన్లు వేయాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్పత్తుల రవాణా కోసం రైల్వే సహకారం అవసరమని సీఎం అన్నారు. ఉత్పత్తుల రవాణా కోసం కేంద్రంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్, గుణదల-ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట, రాయదుర్గ్-తుముకూరు మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సీఎం సమీక్షించారు.
హైదరాబాద్ -బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్కు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతిని కలుపుతూ చెన్నై-బెంగళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఉండేలా చూడాలన్నారు. మరోవైపు ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకూ డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్ పైనా సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు. 1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనులపై కూడా సీఎం ఈ సమీక్షలో చర్చించారు.
ఏపీని లాజిస్టిక్స్ కారిడార్గా మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఉత్తర-దక్షిణ భారత్ల మధ్య కనెక్టివిటీ దిశగా పనులు జరిగాయని.. ఇక తూర్పు నుంచి పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉందని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో తదుపరి పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.27 కోట్ల నిధుల్ని తక్షణం విడుదల. చేయాలని సీఎం ఆదేశించారు. కోటిపల్లి-నర్సాపూర్ మార్గంలో కాకినాడ- కోటిపల్లి- అమలాపురం మార్గంలో రైలు సర్వీసు నడపాలని సూచించారు. అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని రైల్వే శాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ రైల్వే కోచింగ్ టెర్మినళ్లను విస్తరిస్తున్నట్టు అధికారులు వివరించారు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ పనులు వేగంగా చేపట్టాలని… కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రంలో ఐకానిక్ రైల్వే స్టేషన్లు
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతిలను ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నూతనంగా నిర్మించనున్న అమరావతి రైల్వే స్టేషన్ను కూడా వినూత్నంగా నిర్మాణం చేపట్టాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ రీ-డెవలప్మెంట్ పనులు వేగంగా చేపట్టాలని, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం స్కైవాక్ నిర్మించాలని సీఎం సూచించారు. విశాఖలో జ్ఞానాపురం వైపు అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం అన్నారు. ప్రస్తుతం మూడు స్టేషన్లతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి రైల్వే అధికారులు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్టేషన్లను అమృత్ స్టేషన్ల కింద ఆధునీకరిస్తున్నామని వివరించారు. 373 చోట్ల రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రతిపాదించామని వెల్లడించారు. ఈ డిసెంబరు నాటికి రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
కొత్తవలస-కిరండోల్, కొత్తవలస-విజయనగరం, దువ్వాడ, సింహాచలం మార్గాల్లో అభివృద్ధి పనులు, కొత్త మార్గాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని సీఎం పేర్కొన్నారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. రూ.271 కోట్లతో స్టేషన్ అప్ గ్రేడేషన్ పనులు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వివరించారు. పుష్కరాల నాటికి వివిధ ప్రాంతాల నుంచి 1012 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు తెలిపారు. ఈ సమీక్షకు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు కోస్తా రైల్వే జీఎం ఇతర రైల్వే అధికారులు హాజరయ్యారు.











