ఆస్ట్రేలియా (మెల్బోర్న్): బ్రిటీష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్స్యూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్, దినేష్ కంతేటి (హెడ్, ఎంటర్ ప్రైజ్ ఇంటిలిజెన్స్)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుపా సీఓఓ బిజల్ సెజ్ పాల్ మాట్లాడుతూ… లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్యసేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోమ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్కు హామీ ఇచ్చారు.














