- ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్కు మౌలిక సదుపాయాల కల్పన
- రూ.40 వేల కోట్లతో రాయలసీమ రైతు అభివృద్ధికి కార్యాచరణ
- 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యం
- రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతాయని… దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈమేరకు పూర్వోదయ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీంలో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిని మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లులాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు రూ.40 వేల కోట్లతో ప్రణాళిక అమలు చేయనున్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ది కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచబ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాలపై దృష్టి సారించాలనే విషయంపై సీఎం చంద్రబాబు చర్చించారు.
నీతి ఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్ అండ్ బి రోడ్లు, పంచాయతీ రాజ్ రోడ్లువంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘రాయలసీమను హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దటం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. రాయలసీమలో మొత్తంగా 65 రకాల ఉద్యాన పంటలు పండుతుంటే… డిమాండ్ డ్రివెన్ హార్టికల్చర్ 18 రకాల పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకాల పంటలను పండిరచేలా ఉద్యాన రైతులను ప్రొత్సహించాలి. అప్పుడు సీమలో ఉద్యాన పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం సులువవుతుంది. దీనికోసం రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్ క్రాప్స్ కంటే… భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండిరచాల్సి ఉంటుంది. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్ వెరైటీలను పండిరచి ఆ పంటలకు విలువ జోడిరచాలి. అప్పుడే రైతులకు ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఉద్యాన పంటలకు నీటిని అందించాలి. హార్టీకల్చర్ జోన్లుగా తీర్చిదిద్ది ప్రోత్సాహకాలు కల్పించాలి. ఆర్గానిక్ సేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండిరచాలి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉద్యాన పంటలు పండిస్తే అది రైతులకు మేలు కలుగుతుంది. ఆక్వా రంగం తరహాలోనే ఉద్యాన రంగం కూడా భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరుతుంది. ఈ 9 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న 10 రకాల ఉద్యాన పంటలతో పాటు… డిమాండ్ ఉన్న మరో 8 పంటలను కూడా పండిరచేలా చర్యలు తీసుకోండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్కు సీమ ఉత్పత్తులు
‘‘50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల ద్వారా పెద్దఎత్తున రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 18 ముఖ్యమైన పంటలను లక్ష్యంగా చేసుకుని వాటికి మంచి సాగు సదుపాయాలు కల్పించటం, రవాణా, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కోల్డ్ చైన్లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. దుబాయ్లాంటి ప్రాంతాలకు ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేయగలగాలి. దుబాయ్ నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పండ్లను రవాణా చేసే అవకాశం ఉంటుంది. స్పెషల్ కార్గోగా ఈ పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు తరలిస్తే రైతులు, ఈ ప్రాంత భవిష్యత్ మారిపోతుంది. రాయలసీమ ప్రాంతంలో ఇంకా కవర్ కాని గ్యాప్స్ను గుర్తించి అక్కడకూ నీటి సరఫరా కోసం ఎంత వ్యయమవుతుందో అంచనా వేయండి. రాయలసీమకు మంచి రహదారులు వచ్చాయి. మారుమూల ప్రాంతాలను కలుపుతూ మరికొన్ని రహదారులు రావాల్సి ఉంది. తద్వారా మార్కెటింగ్ మెరుగుపడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలుకుని మార్కెటింగ్ వరకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఈ మేరకు మొత్తంగా రూ.14,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఖర్చు పెట్టబోతున్నాం.
ఇందులో సబ్సిడీ రూపంలో రూ.9,000 కోట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ విషయం రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. అరటి, చినీ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమోటా, మిరప, నిమ్మలాంటి వివిధ ఉద్యాన పంటలపై ఫోకస్ పెట్టాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల భూగర్భ జలాలు రాయలసీమలో మెరుగ్గా ఉన్నాయనే ప్రస్తావన వచ్చింది. హంద్రీ-నీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేస్తుండడం వల్ల సీమలో ఉద్యాన సాగు గతంతో పోల్చుకుంటే సులభతరమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. పంటలు చక్కగా పండడంవల్ల ఓవైపు రైతులకు ఆదాయం రావడంతోపాటు… భూముల రేట్లు పెరిగాయని, దానికి తమ ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి ప్రస్తావించారు. కార్యక్రమంలో ఆర్థిక, వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












