- సమస్యలు, సవాళ్లు దాటుకుంటూ ముందుకి..
- ఏడాది పాలనపై ఎక్స్లో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తివంచన లేకుండా ప్రతిరోజూ పని చేస్తున్నామన్నారు. ‘‘అనేక సమస్యలు, ఆర్థిక సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏడాది కాలంలోనే పేదల సేవలో, పింఛన్లు, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో.. లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డీఎస్సీతో టీచర్ ఉద్యోగాలు ఇవ్వనున్నాం. పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది.. మలి అడుగు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.