అమరావతి (చైతన్య రథం): ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ఎమ్.వి.వి.ఎస్ మూర్తి 1980లో గీతం ఇంజనీరింగ్ కళాశాలను మహత్మాగాంధీ పేరిట విశాఖలో ప్రారంభించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ర్పాటైన మొదటి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలగా నాణ్యతా ప్రమాణాలతో గీతం పేరు సాధించింది. కళాశాల విస్తరణ నిమిత్తం 1981లో విశాఖ శివారు ప్రాంతంగా కొండలతో, గుట్టలతో ఉన్న రుషికొండ సమీపాన భూములను అప్పటి కలెక్టర్ అనుమతితో మార్కెట్ ధరకు కొనుగోలు చేశారు. ఇందులో కొంత జిరాయితీ భూమి, కొంత ప్రభుత్వ డి-ఫామ్ భూమి ఉన్నాయి. ప్రభుత్వ రికార్డులలో సహితం ఈ వివరాలు నమోదయ్యాయి. కేవలం విద్యా అవసరాల కోసం వినియోగించే విధంగా 1996లో రాష్ట్ర ప్రభుత్వం 71 ఎకరాలకు ఎలివేషన్ జిఓను ఇచ్చింది. దీనికిగాను నాటి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఎకరా భూమికి రూ.16,000 నుంచి రూ.18,000 వేల వరకు గీతం చెల్లించింది. ఈ లావాదేవీలపై స్పష్టమైన ప్రభుత్వ జిఓలు, రికార్డులు ఉన్నాయి. 2004లో అప్పటి ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో సర్వేలు నిర్వహించి 14 ఎకరాలు అదనపు భూమి ఉన్నట్లుగా, ముఖ్యంగా అభూమి కొండ వాలు, చిన్న చిన్న బిట్ల రూపంలో వేలానికి సహితం పనికిరాని విధంగా ఉన్నట్టు గుర్తించారు.
20ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి గీతం దరఖాస్తు
దీనికి సంబంధించి ఎండాడలో సర్వే నెంబర్లు 16, 17, 18, 20 మరియు రుషికొండ వద్ద సర్వే నెంబర్లు 37, 38లలో ఈ అదనపు భూమిని గుర్తిస్తూ నాటి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సిసిఎలఎ స్థాయిలో మూడు విడతలుగా సమావేశం నిర్వహించింది. విద్యా సంస్థ అవసరాలకు ఈ భూమిని మార్కెట్ ధరకు కేటాయించాల్సిందిగా గీతం అప్పట్లోనే విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో కొంతమంది ప్రవేటు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పట్టా భూమి అంటూ కోర్టును ఆశ్రయించారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేశారు. దీనిపై లోతుగా పరిశీలించిన కోర్టు.. సుధాకర్ రాజు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో వేసిన కేసును కొట్టి వేసింది. ఈ అంశంపై సిఐడి విచారణ అనంతరం ఒక ఎసఆర్ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురిని అరెస్టు చేయడం జరిగింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు ఎండాడ సర్వే నెంబర్ 15లో తమ పూర్వీకుల ఆస్తి అంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ తరహ ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎలివేషన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ పరిస్థితిని గమనించి 2012లో అప్పటి కలెక్టర్ ఐదు విడతలుగా తనిఖీలు జరిపి ఎండాడ సర్వే నెంబర్ 15లో సుమారు 24 ఎకరాలు, రుషికొండ సర్వే నెంబర్లు 37, 38 లలో సుమారు 12 ఎకరాల భూమి చిన్న చిన్న బిట్లుగా ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని సూచించారు.
విద్యాసంస్థ విస్తరణకు వరుస విజ్ఞాపనలు
అప్పటికి నగర శివారు ప్రాంతమైన రుషికొండ పరిసరాలలో క్రమేపీ వద్ధి చెందుతున్న గీతం కళాశాల ఒకవైపు కొండలు మరోవైపు ప్రభుత్వ భూమి మాత్రమే ఉండటంతో తమ విస్తరణకు అవసరమైన భూములను ప్రభుత్వంనుంచి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేసింది. అక్కడక్కడ చిన్న బిట్లుగాఉన్న 50 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేస్తామని 2004 నుంచి ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు గీతం విద్యా సంస్థ లిఖిత పూర్వకంగా కోరుతూ వస్తోంది. స్వర్గీయ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి టిడిపి సహ అన్ని ప్రభుత్వాలకు క్రమం తప్పక గీతం విద్యా సంస్థ విజ్ఞప్తులను పంపుతూ వచ్చింది. గీతం ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై, 2007నాటికి డీమ్డ్ వర్శిటీగా ఎదగడంతో వివిధ రాష్ట్రాల నుంచి, దేశాలనుంచి వచ్చి ప్రవేశం పొందుతున్న విద్యార్ధులతో రాష్ట్రంలోనే అతి పెద్ద విద్యా సంస్థగా రూపుదాల్చింది. దాదాపు 20 వేలమంది విద్యార్ధులతో, ఆసుపత్రులతో విస్తరించింది. పెరుగుతున్న విద్యా, వసతి అవసరాల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వానికి భూమి విషయంలో విజ్ఞప్తులు చేయడం కొనసాగిస్తోంది.
ఎన్నడూ ఉచితంగా ఇవ్వమని కోరలేదు
గీతం విశ్వవిద్యాలయం ప్రభుత్వ భూమిని ఉచితంగా ఎప్పుడూ కోరలేదు. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకే కొనుగొలు చేస్తామని, కేవలం విద్యా సంస్థ అవసరాలకి తప్ప వాణిజ్య అవసరాలకు ఉపయోగించమని స్పష్టం చేస్తూ వస్తోంది. నిజానికి గీతం ప్రభుత్వ భూములను కోరడం కొత్త విషయం కాదు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. 2017 సంవత్సరంలో రాష్ట్ర క్యాబినేట్లో ఒక అంశంగా సహితం చేర్చబడింది. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ కాలంలో మూడు సార్లు జరిపిన తనిఖీలలో ఈ భూములలో ఏ విధమైన నిర్మాణాలు లేవని గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అవుతున్న నేపద్యంలో గీతం విద్యా సంస్థ కేవలం తన విద్యావ్యాప్తికి మరోమారు ప్రభుత్వ భూములను కొనుగోలు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది.
విశాఖకే గర్వకారణం గీతం
నాలుగు దశాబ్ధాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన గీతం విద్యా సంస్థ లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తును అందించింది. ఇంజనీరింగ్ కళాశాల స్థాయి నుంచి దేశంలో ఏ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు సాధించింది. చదువులు చెప్పడం ఒక్కటే కాకుండా పరిశ్రమలకు కన్సల్టెన్సీ అందించడం, గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అందించే శిక్షణ కార్యక్రమాలు, పరిశోధనలు నిర్వహిస్తోంది. గీతం విద్యా సంస్థను కేంద్ర ప్రభుత్వం సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సైరో) గా గుర్తించింది. గీతం విద్యా సంస్థలో వంద కోట్ల రూపాయల వ్యయంతో మూర్తి ప్రయోగ శాలలు ఏర్పాటు అయ్యాయి. వీటికి దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలకు హజరవుతున్నారు. భారత ప్రభుత్వ స్టడీ ఇండియా కార్యక్రమంలో గీతం విద్యా సంస్థ చేర్చబడింది. దాదాపు 500 మంది విదేశీ విద్యార్ధులు గీతంలో చదువుకుంటున్నారు.
ప్రకృతి విపత్తుల్లోనూ గీతం సేవలు
హుద్ హుద్ సమయంలోనే కాక ప్రకృతి విపత్తుల సమయంలో గత ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు గీతం విరాళంగా అందజేసింది. కోవిడ్ -19 సమయంలో గీతం వసతి గృహలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంతో పాటు 3 వేల మందికి పైగా విశాఖ ప్రజలకు గీతం ఆసుపత్రి కోవిడ్ చికిత్స కేంద్రంగా అండగా నిలిచింది. విశాఖ నగరంతో పాటు సమీప జిల్లాలలో ఉచిత వైద్య శిభిరాల నిర్వహణతో పాటు 500 వందలకు పైగా కుటుంబాలను గీతం ఆసుపత్రి విద్యార్ధులు దత్తతకు స్వీకరించారు. గీతం విశ్వవిద్యాలయాన్ని వ్యవస్థాపకులు ఏనాడు తమ కుటుంబ ఆస్తిగా పరిగణించలేదు. గీతం విస్తరణలో అంతర్జాతీయ ప్రమాణాలను మన విద్యార్ధులకు అందించే అంశంలో వ్యవస్థాపకులు నేటికీ నిబద్దతతో వ్యవహరిస్తున్నారు.
గీతం విద్యాసంస్థపై ఎందుకీ కక్ష?
గీతం విద్యా సంస్థ ప్రారంభించే నాటికి స్వర్గీయ డాక్టర్ ఎమ్.వి.వి.ఎస్ మూర్తి విశాఖలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. గీతం ప్రారంభించే సమయంలో ఆయన రాజకీయవేత్త కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకంటే ముందు గీతం విద్యా సంస్థ వ్యవస్థాపకులుగా ఆయన విశాఖ ప్రజలకు పరిచయమున్న ప్రముఖులు. గీతం విద్యాలయాన్ని ప్రపంచ శ్రేణి విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో ఆయన పాటించిన ప్రణాళిక కారణంగా విశాఖకు గర్వకారణంగా గీతం అభివృద్ధి చెందింది. గీతం విశ్వవిద్యాలయం నేటికి పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా నాక్ ఎంం గ్రేడు తో పాటు ఎన్బీఎ గుర్తింపు, టైమ్స్ ప్రపంచ ర్యాంకింగ్లలో స్థానం సంపాధించింది. ఇంజనీరింగ్ విద్యతో పాటు ఆర్కిటెక్చర్, సైన్స్, ఫార్మశీ, మేనేజ్మెంట్, లా, పారామెడికల్ కోర్సులు, దంత వైద్యం, వైద్య విద్యా కోర్సులను నిర్వహిస్తోంది. యుజిసి సహ పలు చట్ట బద్దమైన సంస్థల గుర్తింపుతో గీతం నిర్వహించే వివిధ కోర్సులకు దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆకర్షితులవుతున్నారు. ఇతర రాష్ట్రాలలో ప్రాంగణాలను నెలకొల్పడానికి ఆయా ప్రభుత్వాలు గీతంను ఆహ్వనించిన సందర్భాలు ఉన్నాయి.
వసతుల్లేక దూరవిద్యా కేంద్రం మూత
విశ్వవిద్యాలయం విస్తరణకు భూమి కేటాయింపులో తరువాతి కాలంలో విశాఖలో అడుగు పెట్టిన ఇతర విద్యా సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యత గీతంకు ఇవ్వక పోవడం విశాఖ ప్రజలు గమనిస్తున్నారు. గీతంపట్ల ప్రజలలో ముఖ్యంగా యువతలో గల ఆదరణ కారణంగా గీతం విద్యా సంస్థకు అనుబంధంగా ఏర్పాటైన దూర విద్యా కేంద్రం సరైన వసతి సదుపాయం లేకపోవడంతో అర్ధాంతరంగా మూసివేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో విశాఖలోని దొండపర్తి ప్రాంతంలో కొంతకాలం తాత్కాలిక వసతితో ఈ కేంద్రాన్ని నిర్వహించారు. విద్యార్థులు సంఖ్య లక్షను దాటిపోవడం సరైనవిధంగా వసతి అందుబాటులో లేకపోవడంతో దూర విద్య కార్యకలాపాలను నిలిపివేస్తూ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. గీతం విద్యా సంస్థ సమీపంలోని ఎండాడ గ్రామంలో 2009లో ఏర్పాటైన ఒక విద్యా సంస్థకు 7.35 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎకరం 25 లక్షల రూపాయలు చొప్పున విక్రయిస్తూ 20-02-2009న జివోను నాటి ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే పలు ప్రైవేటు విద్యా సంస్థలకు తదనంతర కాలంలో భూకేటాయింపులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో గీతం పరిసరాల్లో 40 ఎకరాల భూమిని తాము స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.800 కోట్ల రూపాయలు అని నాడు వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అదే వ్యక్తులు గీతం సంస్థ భూమిని కబ్జా చేసిందని వాటి విలువ రూ.5,000 కోట్ల రూపాయలు అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎకరం రూ.12 వేలు ఉన్నప్పటి నుంచి గీతం రుషికొండ, ఎండాడ పరిసరాలలోని ప్రభుత్వ భూములను మార్కెట్ రేటుకు కొంటామని విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కేవలం రాజకీయ కారణాలతో ఒక ఉన్నత విద్యా సంస్థ ఎదుగుదలకు అడ్డం పడటం సరైన పద్ధతి కాదు.













