- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కదలాలి
- నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలదే..
- యోగాడే స్ఫూర్తితో ముందుకు సాగుదాం
- మనందరి ఉమ్మడి టార్గెట్ 2029, 2047 కావాలి
- ఐఏఎస్లు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకోవాలి
- ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): పొలిటికల్ గవర్నెన్స్తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యోగా డే స్ఫూర్తితో హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని, మనందరి ఉమ్మడి లక్ష్యం 2029, 2047 కావాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారులు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకుని.. వాళ్ల ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని పిలుపునిచ్చారు. నిర్దుష్ట లక్ష్యాలతో.. వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాం
‘స్వాతంత్య్రం వచ్చి 2047నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి దేశ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్-2047 రూపొందించారు. మనం కూడా రాష్ట్రం కోసం స్వర్ణాంధ్ర విజన్-2047 రూపకల్పన చేశాం. ప్రజలు అధికారం ఇవ్వబట్టే ఈనాడు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఎన్నికల సమయంలో కూటమిని ప్రజలు ఆదరించి ఓట్లేయడంతో 94శాతం స్ట్రైక్ రేట్తో ఎన్డీయే విజయం సాధించింది. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో ఈ విజయం సాధ్యమైంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎంత అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం. నేను 4వసారి సీఎం అయ్యాను. పదవి నాకు కొత్త కాదు. కానీ క్లిష్టమైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉండి జీతాలివ్వలేని పరిస్థితి ఉన్నా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాను. 2014లో రాష్ట్ర విభజన జరిగి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. బస్సులో ఉండి పాలన చేసి 13.5 శాతం గ్రోత్రేట్ సాధించాం. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఏంచేశాం… ఇంకా ఏం చేస్తామో సమీక్షించుకోవడానికి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సమన్వయంతో మూడు పార్టీలు ముందుకు
ఓటు విభజన జరగకూడదని నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. గెలుపు మా కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్ కోసమని పిలుపునిచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకెళ్లాయి. అధికారంలో మూడు పార్టీలు మిళతమైవున్నా ఎక్కడా సమస్యలు లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దీనికి సహకారం అందిస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఫలితాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనపైవున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే నిత్యం కొత్త విషయాలను తెలుసుకోవాలి. ప్రజల సమస్యల్ని అధ్యయనం చేయాలి. వారి అభీష్టం మేరకు మనం పని చేయాలని అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నా’ అని సీఎం ఉద్భోదించారు.
ఐదేళ్లు మూడు ముక్కలాటాడారు!
‘ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆశలు చాలా ఉన్నాయి. కానీ మనకు అనేక ఇబ్బందులూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎన్డీయే కూటమి పని చేస్తోంది. సూపర్-6తోపాటు మరికొన్ని ఎన్నికల హామీలిచ్చాం. వీటి అమలుపై సమీక్ష చేసుకుంటున్నాం. ఎన్నికల ముందు పార్టీలు హామీలిస్తాయి. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై వాటిని అమలు చేసే బాధ్యత ఉంటుంది. దీన్నే ‘పొలికటికల్ గవర్నెన్స్’ అనేది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంవల్ల రాష్ట్రంనుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోయారు. రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పోయింది. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. శాంతి భద్రతలు దెబ్బతీశారు. మూడు రాజధానులంటూ ఐదేళ్లూ మూడు ముక్కలాడారు’ అంటూ జగన్ పాలనలో సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
సంపద సృష్టిస్తేనే ఖర్చు చేసే హక్కు
పోలవరం ప్రాజెక్టు పూర్తైతే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఏపీకి చాలావరకు నీటి సమస్య తీరుతుంది. దక్షిణ భారతదేశంలో నీటి సౌలభ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ. నదులు అనుసంధానిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసింది. రాష్ట్రంలో పాలన ఉందా? అనే అనుమానాన్ని కలిగించారు. ఎక్కడ చూసినా వేధింపులు, అణగదొక్కే ధోరణిలే కనిపించాయి. పాలన ప్రజల కోసం చేయాలన్న ఆలోచనే నాటి పాలకులకు లేదు. ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అర్హత ఉంటుంది. ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటే ఎక్కడినుంచి డబ్బులు వస్తాయి.? ఆదాయాన్ని పెంచుకుని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులుచూసి 2022-2023లో అప్పులు చేసే అవకాశం లేదని నీతి ఆయోగ్ రిపోర్టు కూడా ఇచ్చింది. తెచ్చిన అప్పులు చెల్లించాలి, అప్పులకు వడ్డీలు కట్టాలి… సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని వ్యవస్థలనూ కుదేలు చేసి వెళ్లిపోయారు. ఒక్క మైనింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల ఆదాయం పోయింది. ఒప్పందం చేసుకున్న సోలార్ విద్యుత్ను వాడకపోవడంతో రూ.9 వేల కోట్లను అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. నిధుల్ని ఇబ్బడిముబ్బడిగా దారిమళ్లించారు. కేంద్ర పథకాలకు వచ్చే నిధులనూ మళ్లించారు. సంక్షేమం సాధికారత, పెట్టుబడుల సాధన, సంపద సృష్టి, ఆదాయం పెంచడం.. ఈ నాలుగింటిని సమానంగా తీసుకెళ్తేనే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు నాంది పలికారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచారు’ అని సీఎం చంద్రబాబు ఉద్భోదించారు.
పట్టుదలతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలి
అధికారంలోకి రాగానే 4 కీలక హామీలపై సంతకాలు చేశాను. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంతకం పెట్టాను. వీటికి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చాం. మాకు ప్రజలనుంచి వచ్చే వినతుల్లో 80శాతం రెవెన్యూకి సంబంధించినవే. పట్టుదలతో పని చేసి ఏడాదిలో అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పింఛన్లు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అందిస్తున్నాం. గత ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్లను అధికారంలోకి రాగానే 203 ప్రారంభించాం. ఇప్పటివరకు 4 కోట్ల మందికిపైగా భోజనాలు అందించాం. రాష్ట్రానికి కేంద్రం సాయం అందిస్తోంది. విశాఖ స్టీల్ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. అమరావతి పనులు చేపట్టి రాజధానిని పట్టాలెక్కించాం. పోలవరానికి రూ.12,500 కోట్లు అందించింది. దీన్ని 2027కి పూర్తి చేసేలా లక్ష్యం విధించుకున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులకు రూ.5 వేల కోట్లు ఇచ్చింది. విశాఖ రైల్వేజోన్ పనులు కూడా సాగుతున్నాయి’ అని సీఎం చంద్రబాబు వివరించారు.