- మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
- రంగుమారిన పత్తిని కూడా సీసీఐ ద్వారా కొనాలని విజ్ఞప్తి
- మూడు ప్రధాన అంశాలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు వివరించిన మంత్రి
- సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి హామీ
- రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అచ్చెన్న భరోసా
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, మత్స్య శాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలంటూ గతంలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం… వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించిందన్నారు. గతంలో లేఖ ద్వారా సూచించిన ఆరు కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు అంశాల అమలు ప్రక్రియను ప్రారంభించిందన్నారు. దీనివల్ల పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యలు పరిష్కారం వైపు సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు కూడా దశలవారీగా ప్రారంభమవుతున్నాయి. కొనుగోలు ప్రక్రియ మొదలయింది.
అయితే మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సీసీఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, మిగిలిన మూడు అంశాలపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం, వాతావరణం కారణంగా తేవ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షాని తడిసిన, రంగు మారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ అంశాల ప్రాధాన్యతను వివరించి, రైతులకు తక్షణ ప్రయోజన కలిగేలా చూడాలని అభ్యర్థించినట్లు తెలిపారు. వీటికై కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, త్వరలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశముందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకూ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కేంద్రం నుండి సానుకూ.నిర్ణయం వచ్చేలా కృషి చేస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.
కొనుగోలకు స్పష్టమైన మార్గదర్శకాలు
రాష్ట్రవ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో 5.39 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగి, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు సంబంధిత జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి కొనుగోలు కేంద్రానికి జిల్లా మార్కెటింగ్ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 11 మార్కెట్ యార్డులతో పాటు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19 జిన్నింగ్ మిల్లుల ద్వారా రూ.56.59 కోట్ల విలువైన 72,240 క్వింటాళ్ల పత్తిని 2,793 మంది -రైతుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, అధిక తేమ శాతం, కొన్ని జిల్లాల్లో పత్తి తీతలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం, అలాగే కొంతమంది రైతులు మొదటి-రెండవ తీత పత్తిని కలిపి విక్రయించాలని ఎదురు చూస్తుండటంతో, అన్ని కేంద్రాలలో కొనుగోలు పూర్తి స్థాయిలో జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. పత్తి కొనుగోలు కోసం కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్ లలో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు గ్రామాలలో పనిచేసే వ్యవసాయ సహాయకులు (వీఏఏ) చొరవ తీసుకొని స్లాట్ బుకింగ్ చేయటంలో -రైతులకు సాయపడాలని మంత్రి అచ్చెన్నాయుడు
ఆదేశించారు.











