- రానున్న 20 రోజులు అత్యంత కీలకం
- అధికారులతో సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు
రాజమహేంద్రవరం (చైతన్యరథం): పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి పనులను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిరచారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్టు హౌస్లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎమ్. వెంకటేశ్వర రావు, ఈఎన్సీ నరసింహ మూర్తి తో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై సోమవారం మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30 కి నాటికి నీరు అందించాలని ఉద్దేశ్యం తో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించామన్నారు. ఎనిమిది ప్యాకేజీల తో కూడిన పనులను వేగవంతం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. వివిధ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనులు పురోగతి, ప్రస్తుత వాస్తవ స్థితిపై సమీక్షించామన్నారు.
నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. ఇప్పటికే ఆమేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియచేయగా, ఏ విధమైన వివరణ కోరారో తనకు తెలియజెయ్యాలన్నారు. పనులు చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ఉంటే, రొటీన్ పద్ధతిలో వివరణ కోరడం సముచితం కాదన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చెయ్యడం కోసం ఇంకా 20 రోజుల సమయం ఉందని, ఈ సమయం అత్యంత కీలకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి, నీరు విడుదల చేయాలని లక్ష్యంతో ఉందని, అధికారులు పూర్తిగా దృష్టిపెట్టి, దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని మంత్రి తెలిపారు. నిధులు మంజూరు విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతి పై ఏజెన్సీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.