- ఉగాదినుంచి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం
- పేదల సాధికారతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం
- బడుగులకు సంపన్న కుటుంబాల తోడ్పాటే పీ`4
- ప్రభుత్వ పథకాలకు అదనంగా పేదలకు సాధికారత
- ఆగస్టునాటికి 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి
- ముందుగా నాలుగు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు అమలు
- అధికారులతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): అట్టడుగునున్న పేదల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీ`4 కార్యక్రమానికి ఉగాదినుంచి శ్రీకారం చుడుతోంది. పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు పీ`4 విధానాన్ని ప్రవేశ పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగునున్న వారికి మరింత చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ‘పీ`4, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ -బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి నివాసంలో శాఖపరమైన సమావేశాన్ని నిర్వహించారు.
పేదరికంలేని రాష్ట్రమే లక్ష్యం
సంపదలో పైవరుసలోనున్న కుటుంబాలు సమాజంలో అట్టడుగునున్న కుటుంబాలకు మద్దతుగా నిలబడటమే పీ`4 విధానం ముఖ్యోద్దేశం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
ఉగాది నాటికి అమల్లోకి పీ4..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ`4 విధానం ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ`4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అధికారులు రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.
కుటుంబాల ధృవీకరణ
ఈ విధానం ద్వారా లబ్ది పొందేందుకు అర్హతవున్న కుటుంబాలను జీఎస్డబ్లుఎస్ డేటాబేస్, హౌస్హోల్డ్ సర్వే, గ్రామసభ ధృవీకరణ ద్వారా గుర్తించడం జరుగుతోంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట భూమివున్న భూయజమానులను, ప్రభుత్వోద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని, ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్లుకన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలవారిని ఈ కార్యక్రమంనుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ`4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
కొనసాగుతున్న హౌస్ హోల్డ్ సర్వే
హౌస్ హోల్డ్ సర్వే మొదటి దశ కింద రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20నుంచి సర్వే జరుగుతోంది. ఇది మార్చి 2కి పూర్తవుతుంది. ఈ పది జిల్లాల్లో 52 లక్షల కుటుంబాలుంటే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. రెండో దశ కింద రాష్ట్రంలో మిగిలిన 16 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే మార్చి 8నుంచి మొదలుపెట్టి మార్చి 18నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. పేద కుటుంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలకు అదనంగా వారి సాధికారత కోసం పీ`4 విధానం ద్వారా సాయం చేయనున్నారు. ఈ సర్వేలు అట్టడుగునున్న వారిని గుర్తించడానికే తప్ప… వీటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్దిదారుల్లో ఎటువంటి మార్పులు చేయరు.
అనుసంధానమే ‘సమృద్ధి బంధనమ్’
లబ్దిదారుల ధృవీకరణ పూర్తైన తర్వాత ‘సమృద్ధి బంధనమ్’ ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్… వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
‘పీ`4’లోకి ఆగస్ట్కల్లా 5 లక్షల కుటుంబాలు
ఈ ఉగాదికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి రానున్న కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టునాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను ‘సమృద్ధి బంధనమ్’ కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సీనియర్ అధికారులు పీయూష్కుమార్, కాటంనేని భాస్కర్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.