రామచంద్రపురం (చైతన్యరథం): డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైతు బజార్..రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్ కృషితో ప్రారంభానికి నోచుకుంది. కొత్తగా నిర్మించిన రైతు బజార్ను మంత్రి వాసంశెట్టి సుభాష్, అధికారులు, కూటమి నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండిరచిన పంటలు నేరుగా రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలుగా పురపాలక సంఘం నిధులు రూ.80 లక్షల రూపాయలతో 25 షాపులు నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రైతే రాజు అనే నిదానంతో తమ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.4500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.8, 856 కోట్లు కేటాయించి రైతుల పక్షపాతిగా నిలిచామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని గత ఏడాది కాలంలో సుమారు రూ. 125 కోట్లుతో అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ హామీలైన సూపర్ సిక్స్ పథకాలు ఏడాదిలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదే అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ 4 ద్వారా 40 కుటుంబాలను దత్తత తీసుకొని నిరుపేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజవర్గంలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న వారికి తక్షణం అత్యవసర వైద్య సేవలు అందేలా మూడు ప్రత్యేక బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అఖిల, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, డిఎస్ఓ ఉదయభాస్కర్, జిల్లా మార్కెటింగ్ అధికారి కె విశాలాక్షి, మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మార్కెటింగ్ డిఈ, మున్సిపల్ డిఈ శ్రీకాంత్, టిపిఓ వాసంశెట్టి శేషగిరి, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ వాసుదేవరావు, కూటమి పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
“