- కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా, బయటా పోరాడతా
- పనిచేసే వారికే పదవులు.. మా విధానం
- పార్టీలో యువరక్తం నింపేందుకు సహకరించండి
- సంక్షేమ సారథిó ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న
- రికార్డులు సృష్టించాలన్నా, బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యం
- టీడీపీ ఆవిర్భావ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): పసుపు జెండా మనకు ఎమోషన్.. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కార్యకర్తలు మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి. ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం… ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అని మంత్రి లోకేష్ అన్నారు.
కరుడుగట్టిన పసుపు సైన్యమే మన బలం
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసారు. ఆ ముహూర్తబలం గొప్పది.. పునాది గట్టిది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢల్లీికి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్థులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము. 43 ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం అని మంత్రి లోకేష్ అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకూ ఎన్ని కష్టాలు ఎదురైనా అదే స్ఫూర్త్తితో పనిచేస్తున్నాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ – దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన పేదల పెన్నిధి చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢల్లీికి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ – తెలుగువారిని ప్రపంచపటంలో పెట్టింది చంద్రన్న. రూ.2 లకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధాప్య పింఛను లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువతకు సీట్లు ఇచ్చింది టీడీపీ. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది టీడీపీ. బీసీలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టీడీపీ. కుల వివక్ష లేకుండా చేసింది టీడీపీ అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మనకు గల్లీ తెలుసు… ఢల్లీి తెలుసు
మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢల్లీి పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడం లో మన కృషి ఉంది. జీఎంసీ బాలయోగిని లోక్సభకు మొదటి దళిత స్పీకర్ చేసింది మనమే. అంబేద్కర్కి భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించాం. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాం. తెలుగుదేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్రెస్ లేకుండా పోయారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.
అరాచకానికి ఎదురొడ్డాం…ప్యాలెస్లు బద్దలుగొట్టాం
2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరు. అయిదేళ్ల పాటు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నాం. మన దేవాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డాం. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడాం. క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపాం. ప్యాలెస్లు బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశాం. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించాం. ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష మేరకే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు.
పేదరికం లేని సమాజమే టీడీపీ లక్ష్యం
పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రూ.200 పెన్షన్ను రూ. 2 వేలు చేసింది మనమే. ఇప్పుడు రూ. 4 వేల పెన్షన్ ఇస్తున్నదీ మనమే. దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికి పరిమితం అయిన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తోంది మనమే. దీపం పథకం కింద ఉచితంగా సుమారుగా కోటి సిలిండర్లు అందజేశాం. 16,347 పోస్టులతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన 177 హామీల్లో పూర్తి స్థాయిలో అమలు చేసినవి 55, పాక్షికంగా అమలు చేసినవి 49.. అంటే దాదాపు సగానికి పైగా హామీలు అమలయ్యాయి. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. త్వరలోనే పీ 4 కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుందని మంత్రి లోకేష్ చెప్పారు.
కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తాం
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టీడీపీ. మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు. దాన్ని మనం సాధించాం. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశాం. ఏపీలో… 1 కోటి 53 వేల 551 సభ్యత్వాలు, తెలంగాణాలో… 1,78,041 సభ్యత్వాలు.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం… 1 కోటి 2 లక్షల 35 వేల 857 సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్లు ఖర్చు చేసింది టీడీపీ. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తాం. 2004లో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించి ఉద్యోగాలకు వచ్చేవరకు నిలబడిరది చంద్రబాబు. పాదయాత్రలో ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలను కలిశా. ప్రస్తుతం వారు వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయికి చేరారు. దేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. అలాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టమని మంత్రి లోకేష్ అన్నారు.
పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తా
కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు టర్మ్లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వ సారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది. నా స్టయిల్ ఒక్కటే… సీనియర్లను గౌరవిస్తా … పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడిరచారు.
రెడ్బుక్ పేరు చెబితే కొందరికి గుండెపోటు
ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తోంది. కొంతమంది బాత్ రూంలో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్థం అయ్యిందా రాజా. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దు, ఇగో వద్దు. అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని యువనేత నారా లోకేష్ పిలుపు ఇచ్చారు.