- జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం!
- కక్షసాధింపు చర్యలు మా విధానం కాదు…
- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మా ధ్యేయం
- కలసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
- స్వర్ణాంధ్ర సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు
- మూడేళ్లలో కోర్ క్యాపిటల్ నిర్మాణాలను పూర్తిచేస్తాం
- విద్యాసంవత్సరం ప్రారంభం లోగా టీచర్ పోస్టుల భర్తీ
- శాసనమండలిలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): పేదరికం లేని ఆంధ్రరాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తాం… సమస్యల పరిష్కరానికి చిత్తశుద్ధితో ఉన్నాం.. కక్షసాధింపు మా విధానం కాదు… రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిద్దాం, కలసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరపున మంగళవారం మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సాగునీటి ప్రాజెక్టులతోపాటు అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లాలో నేను పాదయాత్ర చేసేటపుడు ఆలూరు నియోజకవర్గంలో 200 వాహనాల్లో కార్మికులు వలసలు వెళ్లటం కనిపించింది. సాగునీటి ప్రాజెక్టులు లేకనే ఆ జిల్లా వెనుకబడిరది. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసి వలసల నివారణకు కృషి చేస్తున్నాం. 62 సంవత్సరాలు కష్టపడి ఉమ్మడి ఏపీని అభివృద్ధి చేసుకుంటే, ఒకే సంతకంతో రాష్ట్రాన్ని విభజించారు. 2014లో జీరో నుంచి ప్రయాణం ప్రారంభించాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని అప్పట్లో సీిఎం చంద్రబాబు చెప్పారు, అమరావతికి సంపూర్ణ మద్దతు అని అసెంబ్లీలో నాటి ప్రతిపక్షనేత చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రతిజిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాం.
అనంతపురం జిల్లాకు కియా, రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టులు, కడప, చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెచ్చాం. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లు తెస్తే తర్వాత వచ్చిన వారు తరిమేశారు. ఉభయగోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమలు, విశాఖకు ఎఎంటిజడ్ తెచ్చారు. గతంలో ఐదేళ్లలో 2సార్లు డిఎస్సీ నిర్వహించి 18వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. కియా, హెచ్సిఎల్, కాండ్యుయంట్, జోహో వంటి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి శాసనసభ సాక్షిగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 44వేల పరిశ్రమలు, 6లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేముందుకు పెన్షన్ రూ.200 ఉండేది. చాలీచాలని పెన్షన్ను అప్పట్లోనే ఐదు రెట్లు పెంచి వెయ్యి చేశాం. ఆ తర్వాత రూ.2వేలు చేశాం. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. నిరుద్యోగ భృతి ఇచ్చాం. పసుపుకుంకుమ కింద నగదు సాయంతో మహిళలకు అండగా నిలచాం, ఆదరణ పథకం కింద బీసీలకు పనిముట్లు ఇచ్చాం. ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపాం. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 25వేల కి.మీ. సీసీ రోడ్లు నిర్మించాను. 35లక్షల వీధిదీపాలు ఏర్పాటుచేశా. భోగాపురం ఎయిర్ పోర్టు పనుల ప్రారంభంతోపాటు, విజయవాడ ఎయిర్ పోర్టు విస్తరణ పనులు చేపట్టామని మంత్రి లోకేష్ వివరించారు.
ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రానికి తీరని నష్టం
2019లో ప్రజలు ఒక్క చాన్స్ మాయలో పడి వైసీపీకి అధికారం ఇవ్వడంతో రాష్ట్రం ఎంతో రాష్ట్రం నష్టపోయింది. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు లేవు. ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ ఇవ్వలేదు, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? జె-ట్యాక్స్ కోసం పీపీఏలు రద్దుచేశారు. అవి కొనసాగించి ఉంటే ఇప్పుడు కరెంటు చార్జీలు పెరిగేవికావు. పీపీఏల రద్దువల్ల ప్రధాన పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో అత్యధిక టాక్స్ చెల్లించే అమర్ రాజాను కక్షసాధింపుతో మూసివేసేయడానికి ప్రయత్నించారు. దీంతో లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ తెలంగాణాకు వెళ్లిపోయింది. తమిళనాడు, కర్నాటక, తెలంగాణాతో పోరాడి ఆ సంస్థను రాష్ట్రానికి తెచ్చాం. రాష్ట్రంలో సరైన కన్వెన్షన్ సెంటర్ లేదనే ఉద్దేశంతో టీడీపీ హయాంలో లులూ సంస్థకు విశాఖలో భూమి కేటాయించాం, ఆ ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 25వేలమందికి ఉపాధి లభించేది. గత ప్రభుత్వం వచ్చాక దానిని రద్దు చేశారు. గత పాలకుల వేధింపులతో విసిగిపోయిన లులూ ప్రతినిధులు ఏపీలో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతామని చెప్పారు. విధ్వంసక విధానాల వల్ల అంతిమంగా రాష్ట్రం నష్టపోయింది. మేం కష్టపడి ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీని తెచ్చాం. గత పాలకులు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో అది రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది.
ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి విధానాల వల్ల అనంతపురం నుంచి జాకీ పరిశ్రమ వెళ్లిపోయింది. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి లాంటివి. అభివృద్ధి చేస్తే పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమం చేయడంతో 10లక్షల కోట్ల అప్పుల్లో మునిగాం. ఆ అప్పులపై ప్రస్తుతం నెలకు రూ. 5వేల కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటోతేదీ జీతాలు ఇవ్వడానికి కష్టపడాల్సి వస్తోంది. పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటివి అమలుచేస్తూ సకాలంలో జీతాలు ఇస్తూనే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాల్సి ఉంది. మాటతప్పం అనిచెప్పి గత పాలకులు అమరావతిపై ప్లేటు ఫిరాయించారు. రాజధాని కోసం అమరావతి రైతులు 1631రోజులు ఆందోళనలు కొనసాగించారు. కొందరు పోలీసు అధికారులు మహిళలను బూటు కాళ్లతో తన్నారు. ఆ ఆందోళనల్లో మేం కూడా పాల్గొన్నాం, చాలా బాధేసింది. మాజీ సీఎం బయటకు రావాలంటే అడ్డంకులు సృష్టించారు. అమరావతిని సర్వనాశనం చేశారు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. గత పాలకుల నిర్వాకంతో ఈ రోజు రోడ్లపై గుంతలు పూడ్చడానికే వేలకోట్లు ఖర్చుచేయాల్సి వస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.
అడుగడుగునా తప్పుడు కేసులు
ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రతిపక్ష నాయకులపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారు. గత ఎనిమిది నెలలుగా మేం ఒక్క తప్పుడు కేసుపెట్టలేదు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలంటే దారిపొడవునా పరదాలు కట్టేవారు. 80శాతం పోలీసు బందోబస్తు తగ్గించాం. ఎవరైనా దర్జాగా శాసనసభకు వచ్చేలా చేశాం. నాపై 23కేసులు పెట్టారు, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. పులివెందులలో దళిత మహిళను హత్యచేస్తే పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలు అనిత, ఎంఎస్ రాజులపై కేసులు బనాయించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. మాజీ సీఎం ఇంటిచుట్టూ ఐదేళ్లపాటు 144 సెక్షన్ అమలుచేశారు. ఈ రోజు చూడండి, మేం ఎంత సింపుల్ గా ఉంటున్నామో. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తప్ప ఎక్కడా 144 సెక్షన్ లేదు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు శ్రీశైలం వెళితే పోలీసులు పాత వాసనలు వీడక కమ్యూనిస్టులను గృహనిర్బంధం చేశారు. ఆ సంఘటనను నేను తీవ్రంగా ఖండిరచాను. హోంమంత్రితో మాట్లాడి వామపక్ష నేతలను స్వేచ్ఛగా వదలాలని కోరాను. గత పాలకులు తుపాకులతో బెదిరించి ఆస్తులు లాగేసుకున్నారు. కాకినాడ పోర్టు స్వాధీనం చేసుకున్న తీరే అందుకు ఉదాహరణ. మేం వచ్చాక కేసు పెడితే పరుగెత్తికొని వచ్చి తిరిగి ఇచ్చేశారు. ఐదేళ్లపాటు గత ప్రభుత్వం మాఫియా మాదిరిగా నడిచింది.
మా సభ్యుడు కౌన్సిల్లో మాట్లాడినందుకు ఆయన భూములను 22ఎలో పెట్టారు. గత ఐదేళ్లలో లక్ష ఎకరాల భూములను దొంగచాటుగా లాగేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు కొట్టేయాలని చూశారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ప్రైవేటు వ్యక్తిని పెట్టి, కోర్టు పాత్రలేకుండా చేశారు. గతంలో ఒక జడ్జి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సోషల్ మీడియాలో అవమానించారు. దీనిపై ఇప్పటికీ సీబీఐ విచారణ జరుగుతోంది. నా తల్లిని, నన్ను, శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను అవమానించారు. నా వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు దేవాలయంలా భావించే మా పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిచేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడిచేసి కార్లను తగులబెట్టారు. ఐదేళ్లపాటు అడ్డగోలుగా దోచుకున్న మద్యం కుంభకోణంపై విచారణ జరుగుతోంది. కల్తీమద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటమాడారు. కల్తీ మద్యం తాగి లివర్ పాడై గత ఐదేళ్లలో ఎంతోమంది చనిపోయారు. ప్రస్తుతం ఎంక్వయిరీ కొనసాగుతోంది. పూర్తిస్థాయి విచారణ జరిపి అన్ని వివరాలు బయటపెడతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలపై యథేచ్చగా దాడులు
గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలపై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారుడ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేశారు. మాస్క్ అడిగినందకు డాక్టర్ సుధాకర్ను వేధించి, పిచ్చివాడ్ని చనిపోయేలా చేశారు. తన అక్కను వేధించవద్దన్నందుకు అమర్నాథ్ గౌడ్ అనే బీసీ బాలుడి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు పోసి తగులబెట్టారు. ఇసుక గురించి మాట్లాడినందుకు వరప్రసాద్ అనే దళిత యువకుడికి గుండుకొట్టారు. కల్తీ మద్యంపై ప్రశ్నించినందుకు పుంగనూరులో ఓంప్రతాప్ అనే దళిత యువకుడ్ని హత్యచేశారు. ఇక బాబాయిని ఎలా చంపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నంద్యాలలో దొంగ అనే ముద్ర వేయడంతో అబ్ధుల్ సలాం కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. ఇవన్నీ చూసి పారిశ్రామికవేత్తలు ఏపీలో అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితికి తెచ్చారు. ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయారు. అప్పట్టో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై దాడి ఘటనను రాష్ట్ర ప్రజలందరం కళ్లారా చూశాం. విధ్వంసక పాలనతో రాష్ట్రంలోని లక్షలాది యువత ఉద్యోగాల్లేక పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. ఆ పరిస్థితుల్లో ప్రజలకు మేమున్నామని చంద్రబాబు, పవనన్న, నరేంద్రమోదీ భరోసా ఇవ్వడంతో 94శాతం ఓట్లు, 164 సీట్లతో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. మాపై బాధ్యత పెరిగింది. అనునిత్యం ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాం, ఎవరిపైనా దొంగకేసులు పెట్టడంలేదు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు అహర్నిశలు కష్టపడుతున్నాం. 2019లో జీరోతో పాలన ప్రారంభిస్తే, 2024లో మైనస్ నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తల వద్దకు వెళుతుంటే మళ్లీ జగన్ రారనే గ్యారంటీ ఇవ్వాలని అడుగుతున్నారని మంత్రి లోకేష్ వివరించారు.
సూపర్ `6 హామీలను అమలుచేసి తీరుతాం
సూపర్ -6 హామీలపై నేను స్పష్టంగా చెబుతున్నా. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పిస్తామని చెప్పాం. గత ఎనిమిది నెలల్లో 6.5లక్షల కోట్లు పెట్టుబడులు రప్పించాం. వీటిద్వారా 4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇది తొలి అడుగు మాత్రమే. ఎన్టిపిసి, బిపిసిఎల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా రెన్యువబుల్ పవర్, నక్కపల్లి బల్క్ డ్రగ్, రైల్వే జోన్, రిలయన్స్ సిబిజి ప్లాంట్ వంటివి ముందుకొచ్చాయి. టిసిఎస్ రెండునెలల్లో విశాఖ మిలినీయం టవర్స్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. మెగా డిఎస్సీలో భాగంగా 16347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం. నిరుద్యోగ టీచర్లకు టెట్ నిర్వహించాం. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా డిఎస్సీ నిర్వహణ జాప్యమైంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సీ నిర్వహిస్తాం. ఏప్రిల్, మేల్లో ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరంలోనే కొత్త ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చేలా చేస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాం. బ్రాండ్ ఏపీ పునరుద్దరణ కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో మేం దావోస్ వెళ్లాం. అక్కడ పారిశ్రామికవేత్తలు మాజీ సీఎం జగన్ మళ్లీ రారని గ్యారంటీ ఇస్తే వస్తామని చెప్పారు. పెన్షన్ గురించి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం పెన్షన్ రూ.1000 పెంచడానికి ఐదేళ్లు తీసుకుంటే, మేం ఒకేసారి వెయ్యి పెంచాం. వికలాంగుల పెన్షన్ రూ.6వేలు చేశాం. పెన్షన్ల కోసమే రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, అదీ మా చిత్తశుద్ధి. ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలండర్ల పథకాన్ని ప్రారంభించాం, తొలివిడతలో కోటి కుటుంబాలకు ఉచిత సిలండర్లు ఇచ్చాం. అర్హులైన వారందరికీ ఉచిత గ్యాస్ అమలుచేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
తల్లికి వందనం అమలు చేస్తాం
ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం అమలు చేస్తాం. ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదు. గత ప్రభుత్వం 2019 మే లో అధికారంలోకి వచ్చినా ఒకట్రెండు మినహా అన్ని కార్యక్రమాలను తర్వాత సంవత్సరం ఏప్రిల్ లోనే అమలు చేసింది. హామీల విషయంలో మేం వెనకడుగు వేయం, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతాం. మేం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు రద్దు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్తపన్ను రద్దు చేశాం. జిఓ 117కి ప్రత్యామ్నాయం తెస్తున్నాం. ఐదున్నరగంటలపాటు టీచర్స్ యూనియన్లతో చర్చించాం. 99శాతం సమస్య పరిష్కరించాం. గత పాలకుల మాదిరిగా మేం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఉపాధ్యాయులతో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుచేసింది. అంతకుముందు మేం అమలుచేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశారు. మళ్లీ మేం ఇటీవల ప్రారంభించాం. అత్యంత సున్నితమైన విద్యారంగంలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎలాంటి వివరాలు లేకుండా ఐబికి రూ.15కోట్లు ఇచ్చేశారు. ఇందుకు సంబంధించి షార్ట్ డిస్కషన్ పెడితే త్వరలో వివరాలు ఇస్తా. సిబిఎస్ఇ ఎగ్జామ్స్ కఠినంగా ఉంటాయి. అమలు చేయాలంటే మూడేళ్లు పడుతుంది. ఉపాధ్యాయులకు బేసిక్ ట్రైనింగ్ లేకుండా ఒకేసారి అమలుచేయడంతో 90శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీనిని ఏకపక్షంగా కొనసాగిస్తే ఆడపిల్లలను బడి మాన్పిస్తారు. విద్యాశాఖలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చింది నాడు టీడీపీనే. గత పాలకుల నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45లక్షల నుంచి 33.4లక్షల మందికి తగ్గిపోయింది. ప్రభుత్వ విద్యకు 12లక్షల మంది విద్యార్థులు దూరమయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రాజకీయ నేతల ప్రమేయం లేకుండా టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
పారదర్శకంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు అమలుచేస్తున్నాం. 15ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపట్టాం. కొన్ని నిర్ణయాలను ప్రజలు వద్దంటే వెనక్కి తీసుకున్నాం. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నాం. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు సహా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఎక్కడా రాజకీయనేతల ఫోటోలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండకూడదని స్పష్టంగా ఆదేశాలిచ్చాం. గతంలో పిల్లలకు ఇచ్చే టెక్స్ట్ బుక్ లో కూడా ఫోటోలు ఉండేవి, అవన్నీ తీసేసాం. గతంలో మాదిరిగా కోడిగుడ్డు, బెల్ట్లపై మా పేర్లు లేవు. తప్పుడు ప్రచారానికి దిగుతున్న బ్లూమీడియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. తప్పుడు ప్రచారాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి పంచాయితీలో మోడల్ ప్రైమరీ స్కూలు ఉండాలని నిర్ణయించాం. త్వరలో లీడ్ స్కూల్స్ రాబోతున్నాయి. మొదటిది మంగళగిరిలో ప్రారంభిస్తాం. తర్వాత రాష్ట్రం మొత్తం అమలుచేస్తాం. ఒక క్లాస్కు ఒక టీచర్ తప్పనిసరిగా ఉండాలన్నది మా విధానం. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను రాబోయే ఐదేళ్లలో వరల్డ్ క్లాస్ స్కూళ్లుగా తయారుచేస్తాం. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, సర్కారు విద్యను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు నిబద్ధతతో ఉన్నారు. గత ప్రభుత్వం టీచర్లను వేధించింది. ఇప్పుడు మాకు యూనియన్లు సహకరిస్తున్నాయి, ప్రభుత్వ విద్యావ్యవస్థకు పూర్వవైభవం తెస్తామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
యూనివర్సిటీలను రాజకీయవేదికగా మార్చారు
గత పాలకులు యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. ఆంధ్రావర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డి, ఎఎన్యు వీసీ రాజశేఖర్ వైకాపా కార్యకర్తల్లా పనిచేశారు. విక్రమ సింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి.. రాజారెడ్డి బంధువు. శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో పెద్దిరెడ్డి బంధువు శ్రీకాంత్ రెడ్డిని వీసీగా నియమించారు. ఈరోజు గర్వంగా చెబుతున్నా. యూనివర్సిటీ వీసీ పదవులకు దేశవ్యాప్తంగా 500మంది దరఖాస్తు చేశారు. విద్యావేత్తలనే వీసీలుగా నియమించాం. ఆంధ్రా యూనివర్సిటీకి వీసీగా నియమితులైన రాజశేఖర్ ఐఐటి ఖరగ్ పూర్ నుంచి వచ్చారు. జెఎన్టియు కాకినాడ వీసీగా ఎన్ఐటి వరంగల్లో పనిచేసిన ప్రసాద్ వచ్చారు. యోగి వేమన యూనివర్సిటీకి హైదరాబాద్ వర్సిటీనుంచి ప్రకాష్ బాబు వచ్చారు. సింహపురి యూనివర్సిటీకి ఢల్లీి టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి శ్రీనివాసరావు విసిగా వచ్చారు. రాయలసీమ వర్సిటీకి సీనియర్ కెమికల్ ఇంజనీర్ బసవరాజ్ని వీసీగా నియమించాం. చరిత్రలో తొలిసారిగా నన్నయ వర్సిటీకి ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ప్రసన్నశ్రీని వీసీగా నియమించాం. ఆమెను కేవలం సామాజికవర్గపరంగా మేం నియమించలేదు. ఆమె రాష్ట్రపతి అవార్డు గ్రహీత. సర్దార్ పటేల్ వర్సిటీలో పిహెచ్డి చేశారు. విద్యారంగంలో 38ఏళ్లు సేవలు అందించిన ఆమెను వీసీిగా తీసుకున్నాం.
జల్లెడబట్టి ప్రతిభకలవారిని ఎంపికచేశాం. ఇందులో ఎవరూ మా బంధువులు లేరు. ప్రభుత్వ వర్సిటీలకు పూర్వవైభవం తేవాలని, ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ 3వస్థానానికి తేవాలని, క్విఐఎస్ గ్లోబల్ ర్యాంకులో టాప్ 100లో స్థానం సంపాదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా మేం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్, స్కూల్ కిట్స్, తదితరాలకు సంబంధించి గత పాలకు రూ.4,300 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. ఆ బకాయిలు ఇవ్వబోమని మేం చెప్పడం లేదు. తొలివిడత ఫీజు రీయింబర్స్ ఇటీవల విడుదల చేశాం. త్వరలో పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తాం. విదేశీ విద్య కార్యక్రమాన్ని అమలుచేస్తానని యువగళంలో హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగా చదవాలి, జీఆర్ రేషియో పెరగాలి, వారికి మంచి ఉద్యోగాలు రావాలన్నదే మా లక్ష్యం. వారికి రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నాం
మండలిలో ఒక సభ్యురాలు కేంద్రాన్ని కించపర్చేవిధంగా సభలో మాట్లాడారు, ఆమె మాట్లాడిరది తప్పు. కేంద్ర సహకారం చాలా అవసరం. దారితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే లక్ష్యంతో చంద్రబాబు, పవనన్న బేషరతుగా కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు చర్చ జరగాలి. గతంలో వాజ్ పేయి ప్రధానిగా, చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడిరది ఎన్డిఎ ప్రభుత్వమే. రూ.1300 కోట్లు ఇచ్చి రక్షించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ప్లాంట్ ఏర్పడిరది. కేంద్రప్రభుత్వం రూ.11వేలకోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.2,800 కోట్లు కలిసి సుమారుగా రూ.14వేల కోట్లు ఇచ్చి రీ క్యాపిటలైజ్ చేసి స్టీల్ప్లాంట్ను కాపాడుకున్నాం. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నవారు ఏనాడు స్టీల్ప్లాంట్ను పట్టించుకోలేదు. నా శాఖ కాకపోయినప్పటికీ నేను కేంద్ర మంత్రి కుమారస్వామితో ఆరేడు సార్లు చర్చలు జరిపాను. అందరం కలసి సాధించుకున్నాం. అది ఎన్డిఎ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గత ప్రభుత్వ హయాంలో వరద వచ్చి పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. మేం వచ్చాక ఆర్ అండ్ ఆర్ కింద పోలవరం నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయల రాబట్టాం. గతంలో మా ప్రభుత్వ హయాంలో 72శాతం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తే, గత ప్రభుత్వం కేవలం 5శాతం పనులు మాత్రమే చేసింది. అమరావతిలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం నిధులు ఇచ్చింది, మూడేళ్లలో కోర్ క్యాపిటల్ ఏరియా నిర్మాణం పూర్తిచేస్తాం.
కొత్త అసెంబ్లీ, కౌన్సిల్కు వెళ్లాలని అందరికీ ఉంది. గత పాలకులు రైల్వే జోన్కు కనీసం భూమి కేటాయించలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక భూములు కేటాయించాం. రైల్వేజోన్ పనులు ప్రారంభించాం. పవనన్న నేతృత్వంలో ఎప్పుడూ లేనివిధంగా గ్రామసభలు జరిగాయి. రికార్డు సృష్టించాం. వైసీపీ సర్పంచులకు ఉన్న గ్రామాలకు కూడా పవనన్న నిధులు ఇచ్చారు. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గత ప్రభుత్వం జల్జీవన్ మిషన్కు మ్యాచింగ్ నిధులు ఇవ్వకుండా ఆపేస్తే పవనన్న వెళ్లి కేంద్రంతో మాట్లాడి మళ్లీ దారిలో పెట్టే బాధ్యత తీసుకున్నారు. నేను ఇండియా, పాక్ మ్యాచ్కి దుబాయ్ వెళ్లా. దానిని కూడా ఎగతాళి చేశారు. అక్కడ ఐసీసీ చైర్మన్ను కలిశా. ఏపీలో క్రికెట్ అభివృద్ధి గురించి ఆయనతో చర్చలు జరిపా. అహ్మదాబాద్ తరహాలో అమరావతిలో అతిపెద్ద స్టేడియం నిర్మిస్తాం. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ వస్తుంది. గ్రామస్థాయి నుంచి క్రికెట్, ఇతర క్రీడలను ప్రోత్సహిస్తాం. గ్రూప్ -2 విషయంలో మేం పోరాడాం. పరీక్షలు వాయిదా వేయాలని సీఎం లేఖ రాసినా ఏపీపీఎస్సీ పరీక్షలు యథావిధిగా నిర్వహించిందని మంత్రి లోకేష్ వివరించారు.
వాట్సాప్ ద్వారా పౌరసేవలకు శ్రీకారం
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వివిధ సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా 161ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా 500 రకాల సేవలను ఫోన్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని నెక్స్ జన్ సంస్కరణలను అమల్లోకి తెస్తాం. మంగళగిరిలో ఎంపిటిసి ఎన్నికల్లో ఏకైక దూదేకుల మహిళ గెలిస్తే కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా వేధించారు. ఎంపిటిసిల్లో మెజారిటీ లేకపోయినా ఎంపిపి పదవి కైవసం చేసుకునేందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇకపై ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని నేను ఆనాడే నిర్ణయం తీసుకున్నా. మున్ముందు ఒక యాప్తో ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఇంటర్ హాల్ టిక్కెట్లు వాట్సాప్ ద్వారా డెలివరీ చేశాం. విజనరీకి, ప్రిజనరీకి మధ్య తేడా సభ్యులకు తెలియాలి. విజన్ 2020 అంటే ఆ రోజుల్లో కొందరు ఎగతాళి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూడమనండి. శంషాబాద్ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐఎస్బి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివన్నీ విజన్ ` 2020లో భాగంగా వచ్చినవే. నాయకుడికి విజన్ ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మొదటి సంవత్సరంలో 12.5 వృద్ధి రేటు చూపించామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
డబుల్ ఇంజన్ సర్కారు వల్లే అభివృద్ధి!
విజన్` 2047 ఎందుకు సాధ్యం కాదు, 15శాతం వృద్ధిరేటు సాధించి చూపిస్తాం. ప్రపంచంలో భారత్ ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉండాలని ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్ణయించారు. సింగపూర్ అనేది ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం, ఈ రోజు ప్రపంచంలో నెం.1 అయింది. విజన్ ` 2020 ఆలోచనే సింగపూర్ నుంచి వచ్చినదే. సీఎంగా పనిచేసిన వ్యక్తి విజన్ను ఎగతాళి చేస్తున్నారు. విజన్` 2020 ఫలితాలు ఆయనకు కన్పించడం లేదా? చంద్రబాబు ఆనాడు వేసిన పునాదే నేటి హైదరాబాద్ ఆభివృద్ధికి కారణం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగిస్తూ పనిచేశాయి. అమరావతి విషయంలో గత పాలకుల చర్యలవల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. కర్నూలులో హైకోర్టు బెంచి కోసం మేం పనిచేస్తున్నాం. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలుకు హైకోర్టు బెంచి తెచ్చి తీరుతాం, అది మా నిబద్ధత. మాకున్న చిత్తశుద్ధి. నేను గర్వంగా చెబుతున్నా. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోంది. కేంద్రంలో మోదీ, ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఎన్టిసిపి గ్రీన్, 90వేల కోట్ల బిపిసిఎల్ రిఫైనరీ.. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే వచ్చాయి. ఎన్డిఎలో భాగస్వాములు కావడం వల్లే పెద్దఎత్తున అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారు?
ప్రతిపక్ష హోదా గురించి సభ్యులు చర్చకు తెచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గైడ్ లైన్స్ను మనం అనుసరించాల్సి ఉంది. ఇందులో లోక్సభ స్పీకర్ డైరెక్షన్స్లో కండీషన్స్ ఫర్ రికగ్నిషన్ పేజి నెం.62లో 121సి పాయింట్లో టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్షహోదా ఇవ్వాలని స్పష్టంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రికి పార్లమెంటు గురించి తెలియదేమో. అసెంబ్లీకి సంబంధించి కూడా అటువంటి నిబంధనలే ఉన్నాయి. పేజి నెం.19లో 56వ అంశంలో అదేతరహా నిబంధనలు పొందుపర్చబడి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి 2019 జూన్ 13న అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబుకి 23మంది శాసనసభ్యులు ఉన్నారు, ఐదుగురిని లాగేస్తే 17లేదా 18మంది ఉంటారు, అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉండదని సభ్యుల సాక్షిగా చెప్పారు. ఈ రోజు ఏవిధంగా మీరు ప్రతిపక్ష హోదా అడుగుతారు? ప్రభుత్వ విధానాలతో విభేదించి గతంలో పలు సందర్భాల్లో మేం కూడా నిరసన తెలిపాం. గవర్నర్పై మేం కాగితాలు విసరలేదు. ఏపీ చరిత్రలో ఇలా చేయడం చరిత్రలో రెండోసారి. గతంలో ఏపీ విభజన సమయంలో అలా జరిగింది. గవర్నర్ను గౌరవంగా మనం పిలుచుకున్నాం, మన విజ్ఞప్తి మేరకు ఆయన ప్రసంగించారు. సమస్యలపై డిబేట్ చేయండి. ఈ రోజు వారు సభలో లేరు, పారిపోవడం కరెక్టుకాదు. వీసీల విషయంలో వారు కోరిన విధంగా ఫైళ్లు తెప్పించి పరిశీలిస్తా, ఆరోపణలు నిజమైతే విచారణ చేపడతాం. స్వప్రయోజనం కోసం తప్ప ప్రజాసమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదు. చిన్నచిన్న తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ, కౌన్సిల్ లో సమస్యలపై చర్చ జరగాలి. గవర్నర్ ప్రసంగంలో సూపర్ ` 6 అంశాన్ని ప్రస్తావించారు. పేజి నెం.2లో ప్రజాసంక్షేమం కోసం సూపర్ ` 6 అమలుచేస్తామని స్పష్టంగా చెప్పారు. పాదయాత్రలో విద్యాపరంగా ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర సాధనకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.