- దసరా ఉత్సవాలంటే విజయవాడ గుర్తుకురావాలి
- ప్రతి సంవత్సరం నిర్వహించాలి
- ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం
- పున్నమిఘాట్లో నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి
విజయవాడ(చైతన్యరథం): మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుంది.. దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడుకునే వారు.. ఇకపై దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవ్’ గురించి మాట్లాడుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్లో సోమవారం నిర్వహించిన ‘విజయ వాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడి తో కలిసి విజయవాడ ఉత్సవ్ వేడుకలను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. జై భవాని.. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మను దర్శించుకొని ఏ పని ప్రారంభించినా విజయమే. వెంకయ్యనాయుడిని చూస్తూ పెరిగాను. ఆయన పట్టు దలను చూస్తే ఏమైనా సాధించవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా తన ప్రయాణం ప్రారంభించారు. ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. తెలుగుభాషను కాపాడేందుకు అహర్నిరిశలు కృషి చేశారు. ఆయన పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జీవోలన్నీ తెలుగులో ఇస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. వాజ్ పేయి, అద్వానీ, మోదీతో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్య నాయుడు ఒక పని అనుకుంటే అది అయ్యేవరకు వదిలిపెట్టరు. ఆయనపై మాటలతో, వాదనలతో గెలిచిన వారు ఎవరూ లేరు. మనం ఎవరం మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ కొడుతుంది. కానీ వెంకయ్యనాయుడు గంట సేపు ఉపన్యాసం ఇచ్చినా విసుగు పుట్టదు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వయసు ఒక సంఖ్య మాత్రమే.
ఆయన స్పీడ్ చూసి ఈరోజుకి కూడా నేను అసూయ పడుతున్నాను. ఎప్పుడు చూసినా పని తప్ప వేరే ఆలోచనలు ఆయనకు ఉండవు. సీఎం చంద్రబాబుతో పోటీ పడాలని అనుకుంటున్నా.. నా వల్ల కావడం లేదు. అదే పరిస్థితి వెంకయ్యనాయుడుతో కూడా ఉంది. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తు న్నారు. నాటి తరం నేతలు వాజ్పేయి, అద్వానీ నుండి ప్రస్తుత ప్రధాని మోదీతో కూడా కలిసి పని చేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
కళాకారులకు అద్భుతమైన వేదిక సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజే సేందుకు విజయవాడ ఉత్సవ్ తోడ్పడుతుంది. రాష్ట్రం లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు వారి కళలను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన వేదికగా విజయవాడ ఉత్సవ్ నిలవబోతోంది. దాదాపు మూడు వేలమంది కళాకారులు, 30 కళారూపాలతో కోలా హలంగా రికార్డ్ స్థాయిలో ఉత్సవ ఊరేగింపు (కార్ని వాల్) నిర్వహించబోతున్నాం. ఇప్పటికే కృష్ణా తీరాన ఆకాశ వీధుల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్ షో, డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్లను చూశాం. పదకొండు రోజులపాటు ఐదు ప్రధాన వేదికలలో 250కి పైగా కార్యక్రమాలను ఈ విజయవాడ ఉత్సవ్ వీక్షించ బోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
దసరా ఉత్సవాలంటే విజయవాడ గుర్తుకురావాలి
వ్యవసాయ, వాణిజ్య, విద్య, ఆటో మొబైల్, చేనేత రంగాలకు చెందిన దాదాపు ఆరువందల స్టాల్స్తో భారీ ఎక్స్పో మనం ఏర్పాటుచేసుకున్నాం. హెలి కాప్టర్ రైడ్స్, పారామోటరింగ్ ఏర్పాటు చేశాం. ఆంధ్రా భోజనంతో పాటు దేశంలోని అన్నిరకాల వంటకాలను విజయవాడకు తీసుకువచ్చాం. ఇప్పటివరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు దసరా ఉత్సవాలంటే విజయవాడ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటారు. ఆవిధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపడతారు. అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొనాలంటే నాకు కొంచెం ఇబ్బందికరం. లండన్లో వింటర్ వండర్ ల్యాండ్ అని ఉంది. అక్కడికి నేను 2019లో వెళ్లాను. దశా బ్దాలుగా అక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇదొక శాశ్వతఆకర్షణగా ఉండాలి. టూరిజంను పెద్దఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులుకూడా వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా విజయవాడ ఉత్సవ్ మారాలని నిర్వాహకులను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని అభినందిస్తున్నా. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
ప్రముఖులకు సత్కారం
విజయవాడ ఉత్సవ్ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు.ఎన్.సి దాస్, కామినేని పట్టాభిరామయ్య, డాక్టర్ సమరం, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు దంపతులు, పాలడుగు లక్ష్మణరావు, జి. నారాయణ రావు, డాక్టర్ జంధ్యాల శంకర్, వక్కలగడ్డ భాస్కర్ రావు, మన్మోహన్ సింగ్, కోనేరు శ్రీధర్, దిండకుర్తి మహేష్, పేడేటి పుల్లయ్య, సుంకర రాజేంద్రప్రసాద్, బి. వెంకట్రావు, మోతుకూరి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అంతకుముందు పున్నమి ఘాట్కు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పున్నమి ఘాట్లో నెలకొల్పిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ప్రముఖులు, భారీగా హాజరైన జనం ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. ఈకార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, కొలికపూడి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాము, ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కన్వీనర్ ముత్తవరపు మురళీ కృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, తదితరులు పాల్గొన్నారు.