- జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం
- సాగునీటి వ్యవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్
- కాళేశ్వరం నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు
- మాతృభాషను కాపాడుకోవటం మనందరి బాధ్యత
- 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలుగుభాష పరిరక్షణ ఉద్యమానికి సీఎం పిలుపు
- తపాలాశాఖ ప్రత్యేక కవర్ ఆవిష్కరణ
గుంటూరు (చైతన్యరథం): తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి పురోగతి సాధ్యమవుతుందని… ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని…. తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. గుంటూరులో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని తపాల శాఖ రూపొందించిన ప్రత్యేక కవర్ను ముఖ్యమంత్రి అవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ… మనం రెండు రాష్ట్రాలుగా ఉన్నా. తెలుగే మనకు మాతృభాష అన్నారు. తెలుగు వారంతా ఐకమత్యంగా ఉంటేనే అగ్రస్థానంలో నిలుస్తాం. సాగునీటి వ్యవస్థకు దారి చూపింది. ఎన్టీఆర్. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ కాలువలు తెచ్చారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి లిఫ్ట్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశాను. కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేసి 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. గోదావరి నదిపై అలీ సాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం. ఆంధ్రా ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చాం. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించాం. ప్రతి ఏడాది గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఏపీలో నదులను అన్నింటినీ అనుసంధానించాలి. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మాతృ భాష పరిరక్షణ మన బాధ్యత
ఘన చరిత్ర కలిగిన మన మాతృ భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలి. సంక్రాంతికి ముందే మనకు అమ్మ భాష పండుగ వచ్చింది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనమే ఈ ప్రపంచ తెలుగు మహా సభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్కు నా ప్రత్యేక అభినందనలు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరును ఈ వేదికకు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకే ప్రాచీన హెూదా లభించాయి. అందులో తెలుగు ఉండటం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. ఈ సభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం సంతోషదాయకం. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, భాష గొప్పదనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి.. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, బెంగాల్లో కూడా తెలుగు చదివే విద్యార్థులు ఉన్నారు. దేశంలో జాతీయ భావన పెరగాలి. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది. ఏ భాష తక్కువ కాదు… ఎక్కువ కాదు. మాతృభాష అమ్మతో సమానం. భాష అనేది మన సంస్కృతిని ముందుకు తీసుకు వెళుతుంది. మన అస్తిత్వాన్ని కాపాడుతుంది. అమ్మ భాషే లేకపోతే మన జీవితాలకు, మన జాతికి అర్థమే ఉండదని ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహనీయులు
తెలుగు సాహిత్యంలో మనకు ముందుగా గుర్తు వచ్చేది అదికవి నన్నయ్య రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్ట దిగ్గజాల వరకు… గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు… ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమ ఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలను మర్చిపోలేం. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ… జ్ఞానపీఠ్ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంథిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తిని తెలుగు జాతి మర్చిపోదు. మద్రాసీలని పిలిచిన వారందరికీ తెలుగు వారి ఆత్మగౌరవం ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్, నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. దేశంలో మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు, ఆనాడు తెలుగు జాతి ఐక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు రామోజీ రావు చేసిన సేవను మరిచిపోలేం, సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం మనకు గర్వ కారణం. ఇటాలియన్ యాత్రికుడు ‘నికోలో డి కాంటే’ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. తమిళ కవి సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగై’ అని కీర్తించారు. మన ప్రాస- యాస, మన సంధులు -సమాసాలు, మన సామెతలు-పొడుపు కథలు అన్నీ మనకే ప్రత్యేకం. అందుకే దేశ బాషలందు తెలుగు లెన్స అని శ్రీకృష్ణ దేవరాయులు కీర్తించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అభినందనీయం
తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత్ పరిషత్ సేవలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సభల ద్వారా విదేశాల నుంచి తెలుగు ప్రతినిధుల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. కవి సమ్మేళనాలు, సదస్సులు, పుస్తక ప్రదర్శనలతో తెలుగు సంస్కృతిని సదస్సులో చాటారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి, ప్రతిభచూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు, ఆంధ్ర శ్రీ – ఆంధ్ర సారస్వత రత్న వంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం. నాడు 1911లో చెన్నయ్లో నాటిన చిన్న విత్తనం 1949లో హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్గా ఎదిగింది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. గజల్ శ్రీనివాస్, కడిమిళ్ల వరప్రసాద్, మేడికొండ శ్రీనివాస్, చక్రావధానుల రెడ్డప్ప వంటి వారు 2017లో ఆంధ్ర సారస్వత్ పరిషత్కు మళ్లీ ఊపిరి పోశారు. 2022లో భీమవరంలో, 2024లో రాజమండ్రిలో, ఇవాళ గుంటూరులో ఈ సంబరాలు చేస్తున్నారు. 2027లో మారిషన్లో నిర్వహించ తలపెట్టారు. తెలుగు మహా సభలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. విలువలు నేర్పేది సంస్కృతి. సంస్కృతికి మూలం భాష.. భాషాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం. అలాగే వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ప్రపంచ మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
టెక్నాలజీతో భాషను కాపాడుకోవడం సులభం
హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాషలో రాణిస్తేనే ఏ రంగంలోనైనా రాణిస్తాం. టెక్నాలజీ వల్ల భాషను కాపాడుకోవడం సులభతరం అవుతుంది.
ఉద్యోగానికి, ఉపాధికి ఇంగ్లీష్ అవసరం, జీవితానికి మాతృభాష అవసరం. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు. అది మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఆధారం. మాతృభాషను కాపాడితేనే సంస్కృతి నిలబడుతుంది. ఎన్టీఆర్ 1985 లో హైదరాబాద్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని స్థాపించారు. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ చాటి చెప్పగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని నేను పిలుపునిచ్చాను. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ముందుందాలని నాడు సైబరాబాద్ నిర్మించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఇచ్చిన ఐటీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు అద్భుతంగా రాణిస్తున్నారు. సమైక్యాంధ్రలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా నవ్యాంధ్రలో రెండోసారి ముఖ్యమంత్రి పనిచేసే అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు జీవితమంతా రుణపడి ఉంటాను.
చాలా దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయోవృద్ధులు పెరుగుతున్నారు.. మన దేశానికి యువత గొప్ప వరం. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదాం. ప్రపంచంలో తెలుగు జాతి గొప్ప స్థానంలో నిలవాలన్నదే నా సంకల్పం. మన కవులు, కళాకారులు, వారసత్వ సంపదను కాపాడుకుందాం. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పది. మన సంస్కృతిని చాటి చెప్పే పండుగలను అనందంగా జరుపుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, ఏపీ శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.















