- ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
- జాతీయ, అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ విధానాలను పరిశీలించండి
- ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్పై 3న శాసనసభ్యులతో వర్క్ షాప్
- పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు
- అమరావతిలో ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులు వేగవంతం
- విద్యాశాఖ అధికారులతో సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ విధానాలను పరిశీలించాల్సిందిగా అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాలవిద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖ అధికారులతో మంత్రి లోకేష్ శనివారం చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఏపీ మోడల్ ఎడ్యుకేషన్, జిఓ 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈనెల 3వ తేదీన శాసనసభ్యులతో ఉండవల్లి నివాసంలో వర్క్ షాపు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల, తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీ మేరకు పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని సూచించారు. యాక్టివ్ లెర్నింగ్ అవుట్ కమ్స్పై దృష్టి సారించాలని కోరారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులను వేగవంతం చేయాలన్నారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఒకేషనల్, ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చి, ఎంప్లాయ్మెంట్, ఎంటర్ ప్రైజింగ్పై దృష్టిసారించాలని సూచించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్న పరిశ్రమల క్లస్టర్లకు అవసరమైన నైపుణ్యం గల యువతను సిద్ధం చేసే బాధ్యత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోవాలని అన్నారు. పాఠశాల విద్య నుంచి ఇంటర్, డిగ్రీవరకు చేరని డ్రాపవుట్స్ను కనీస స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు స్కూలు మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసి)లను బలోపేతం చేసి, వారిని భాగస్వామ్యులను చేయాలి, సోషల్ గ్రూప్స్, ప్రాంతాల వారీగా చర్యలు తీసుకోవాలన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాల కారణంగా పాఠశాల విద్యలో నెలకొన్న డొల్లతనాన్ని ఇటీవల అసర్ నివేదిక బహిర్గతం చేసింది, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై దృష్టిపెట్టాలని సూచించారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను కూడా సమీక్షించాలని అన్నారు.
గ్రామస్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు స్పోర్ట్స్ లీగ్స్ నిర్వహించి క్రీడలను ప్రోత్సహించాల్సిందిగా సూచించారు. కేవలం విద్యా సంబంధ అంశాలపైనేగాక కో కరిక్యులర్ యాక్టివిటీస్పై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని సాధించేందుకు కళాశాలల వారీగా ఎప్పటికప్పుడు ప్లేస్ మెంట్స్ను ట్రాక్ చేస్తూ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్ రామస్వామి, సౌమ్య వేలాయుధం, వి.మాధవన్, తదితరులు పాల్గొన్నారు.