తిరుపతి (చైతన్యరథం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండునెలల్లో ముగియనుందని, ఆ లోగా బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో అందజేస్తున్న స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి, యూనిట్లు 100 శాతం గ్రౌండిరగయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. శనివారం తిరుపతిలోని పద్మావతి గెస్ట్హౌస్లో జిల్లా బీసీ కార్పొరేషన్, చేనేత, జౌళిశాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా సీఎం చంద్రబాబునాయుడు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.ఇందుకోసం పాడి, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు, మహిళలకు కుట్టుమిషన్లతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణపై ఆర్థిక సాయమందించనున్నట్లు తెలిపారు.
జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు కూడా ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. అన్ని కులవృత్తులవారికి ఆర్థిక భరోసా కలిగించేలా యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందజేస్తున్నామన్నారు. బీసీ స్వయంఉపాధి యూనిట్ల దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. రాబోయే రెండు నెలల కాలంలో జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని యూనిట్లు గ్రౌండిరగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులకే ప్రాధాన్యమివ్వాలన్నారు. యూనిట్ల ఏర్పాటులో ఇబ్బందులు రాకుండా జిల్లా స్థాయి బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో యూనిట్ల నిర్వహణపై మంత్రి ఆరా తీశారు.
చేనేతకు పెద్దపీట
జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయాలకు తీసుకుంటున్న చర్యల గురించి చేనేత, జౌళి శాఖాధికారులను మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు చేనేత పరిశ్రమకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వీవర్ శాలలు, టెక్స్టైల్స్ పార్కులతో చేనేత క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేతన్నలకు 365 రోజులూ పనికల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ధ్యేయమన్నారు. దీనిలో భాగంగానే చేనేత రంగానికి ఆర్థిక పరిపుష్టి కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చారన్నారు. పలు రాయితీలు నేతన్నలకు అందిస్తున్నారన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, చేనేత జౌళి శాఖ ఏడీ పి.వరప్రసాద్, ఆప్కో జిల్లా మార్కెటింగ్ అధికారి కోటేశ్వరరావు, ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఏడీ వెంకట్రావు, లేపాక్షి మేనేజర్ రవి, తదితరులు పాల్గొన్నారు.